విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో వైసీపీ ద్వంద వైఖరి: చంద్రబాబు
ABN, First Publish Date - 2021-11-01T21:18:19+05:30
విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో వైసీపీ ద్వంద వైఖరి అవలంభిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు.
అమరావతి: విశాఖ స్టీల్ప్లాంట్ విషయంలో వైసీపీ ద్వంద వైఖరి అవలంభిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంతో రైతులకు అవస్థలు పడుతున్నారని తెలిపారు. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలన్నారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్, సెస్ తగ్గించే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అప్పుల కోసం గవర్నర్ సార్వభౌమాధికారాలనూ తాకట్టు పెట్టారని తప్పుబట్టారు. ఉపాధి కూలీలకు నెలల తరబడి వేతనాలివ్వకపోవడం దుర్మార్గమన్నారు. నీరు-చెట్టు, నరేగా బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
‘‘ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఓటర్లు ఏకమై వైసీపీని ఓడిస్తేనే రివర్స్ పాలనకు గండి పడుతుంది. వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుంది. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ప్రజల్ని, రైతుల్ని సంక్షోభంలోకి నెట్టారు. రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితి కల్పించారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వ డొల్లతనం బయటపడింది. గంజాయిపై ప్రశ్నించినవారిపై కేసులు, దాడులు చేస్తున్నారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ పోరాటం చేస్తుంది’’ అని చంద్రబాబు ప్రకటించారు.
Updated Date - 2021-11-01T21:18:19+05:30 IST