ప్రజా కంటకులుగా వైసీపీ పాలకులు : వేమూరి ఆనంద సూర్య
ABN, First Publish Date - 2021-01-19T20:10:52+05:30
రాష్ట్రం ప్రభుత్వంపై టీడీపీ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏలూరు: రాష్ట్రం ప్రభుత్వంపై టీడీపీ నేత, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్, వైసీపీ నాయకులు పేద ప్రజల పాలిట ప్రజా కంటకులుగా మారారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి మందగించిదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి సీఎం జగన్ నెట్టుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నిధులను సీఎం జగన్, ఆయన తాబేదారులు, వైసీపీ నాయకులు దారి మళ్ళిస్తున్నారని ఆయన విమర్శించారు. సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందడం లేదని, అవి కేవలం వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
జగన్ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఒక పద్ధతి ప్రకారమే దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం అవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పటికీ నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయన్నారు.
రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం జరుగుతున్నా హిందుత్వ ప్రతినిధులుగా చెప్పుకునే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ విష కౌగిలిలో బీజేపీ నేతలు చలి కాగుతున్నారా అని ఆయన విమర్శించారు. సీఎం జగన్తో బీజేపీ నాయకులు కుమ్మక్కయ్యారని ఆయన పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో హిందుత్వాన్ని కాపాడేది చంద్రబాబు ఒక్కరే అని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఒక్క విధ్వంసకర సంఘటన కూడా జరుగులేదన్నారు. హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా టీడీపీ ఆధ్యర్యంలో త్వరలో అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
Updated Date - 2021-01-19T20:10:52+05:30 IST