సీఎం అండతోనే నాపై కేసులు
ABN, First Publish Date - 2021-03-08T09:52:14+05:30
ఏపీ సీఎం జగన్ అండతోనే తనపై తప్పుడు ఆరోపణలతో 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, తన సొంత నియోజకవర్గం నరసాపురంలో పర్యటనను
నైతిక మద్దతు ఇవ్వండి.. ఎంపీలకు రఘురామ లేఖ
న్యూఢిల్లీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్ అండతోనే తనపై తప్పుడు ఆరోపణలతో 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, తన సొంత నియోజకవర్గం నరసాపురంలో పర్యటనను అడ్డుకోవడానికి కుట్ర పన్నారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు నైతికంగా మద్దతు ఇవ్వాలంటూ తన సహచర ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఎంపీలకు లేఖ రాశారు. తన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకుంటూ తన విధి నిర్వహణకు భంగం కలిగిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సీఎం ప్రోత్సాహంతో, డీజీపీ అండతో స్థానిక పోలీసులు, పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన మంత్రి శ్రీరంగనాథరాజు కలిసి తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. దీంతో సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన ఫిర్యాదుపై స్పీకర్ కార్యాలయం.. తదుపరి విచారణకు కేంద్ర హోంమంత్రిత్వశాఖను ఆదేశించిందని వివరించారు.
ఏపీ ప్రభుత్వ వివరణ తీసుకుని వాస్తవ పరిస్థితులను విచారించి పక్షం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించమని స్పీకర్ కార్యాలయం కేంద్ర హోంశాఖకు సూచించిందని గుర్తు చేశారు. ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా హడావుడిగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు నైతిక మద్దతు ప్రకటించాలన్నారు.
Updated Date - 2021-03-08T09:52:14+05:30 IST