cm jagan ఆర్ధిక వ్యవస్థను భ్రష్టుపట్టించారు: యనమల
ABN, First Publish Date - 2021-07-18T17:33:39+05:30
పరిపాలించే స్థానాల్లో సొంత వారు.. పరిపాలించబడే స్థానాల్లో బడుగులా? అంటూ యనమల ప్రశ్నించారు.
అమరావతి: పరిపాలించే స్థానాల్లో సొంత వారు.. పరిపాలించబడే స్థానాల్లో బడుగులా? అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉన్నా.. దుబారాకు వెనకాడని సీఎం జగన్ రెడ్డి.. ఖజానా ఖాళీ చేశారని, ఆర్ధిక వ్యవస్థను భ్రష్టుపట్టించారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసి.. రాచరిక వ్యవస్థను విస్తరిస్తున్నారని అన్నారు. అధికారాలు, నిధులున్న పదవులు సొంతవారికి కట్టబెట్టారని, నిధులు లేని, అప్రధాన్య పదవుల్ని బడుగు వర్గాలకు కేటాయించారని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి.. ఆర్ధిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. సంక్షేమానికి, జీతాలకూ అప్పులపైనే ఆధారపడుతున్నారన్నారు. పెన్షన్లు పెంచడానికి డబ్బులేవు గానీ.. దుబారాకు తక్కువ లేదని ఎద్దేవా చేశారు. సలహాదార్ల పేరుతో వందల కోట్లు దుబారా చేస్తున్నారని, ఇప్పుడు నామినేటెడ్ పదవుల పేరుతో దోపిడీకి సిద్ధమయ్యారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని ప్రభుత్వ దుబారాకు వాడేశారని, 1180 ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రే చేస్తున్నారని యనమల దుయ్యబట్టారు.
Updated Date - 2021-07-18T17:33:39+05:30 IST