బారులు తీరారు
ABN, First Publish Date - 2021-05-05T05:14:04+05:30
ఏలూరులో మంగళవారం జనసంచారం అసాధారణంగా పెరిగింది.
కర్ఫ్యూ ప్రకటనతో నిత్యావసరాలకు పోటెత్తిన జనం
నిండిన మార్కెట్లు, షాపులు , బ్యాంకులు, ఏటీఎంలు
లాక్డౌన్ అనుమానంతో అంతా వీధుల్లోకి ..
ఏలూరు, మే 4(ఆంధ్రజ్యోతి): ఏలూరులో మంగళవారం జనసంచారం అసాధారణంగా పెరిగింది. ఇప్పటి వరకూ అవసరమైతే తప్ప బయటికి రాని జన ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. బుధవారం నుంచి జిల్లా అంతటా కర్ఫ్యూ అమలులోకి రానుండడంతో ముందస్తు అవసరాల కోసం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. కిందటేడాది జనతా కర్ఫ్యూ మాదిరి గానే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ కర్ఫ్యూని కూడా పూర్తి స్థాయి లాక్డౌన్గా ప్రకటిస్తారన్న భయం సాధారణ ప్రజలను వెంటాడుతుండడంతో రద్దీ అసాధారణంగా పెరిగింది. నిత్యావసర సరకులు, నగదు, మందుల కోసం అందరూ ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చేశారు. దీంతో ఏలూరు నగరంలోని అన్ని ప్రధాన రహదారులు, మార్కెట్లు, బ్యాంకులు, ఏటీఎంలు, మందుల షాపులు జనం రద్దీతో కిటకిటలాడాయి. నెలకు సరిపడా బియ్యం, ఉప్పు, పప్పు, వంటి నిత్యావసరాలను సేకరించేందుకు మార్కెట్లు, రిటైల్ షాపుల్లో బారులు తీరారు. ఏలూరు ప్రధాన మార్కెట్, మెయిన్ బజార్లో కాలు పెట్టడానికి వీలు లేనంతగా రద్దీ కనిపించింది. నగరంలోని షాపింగ్ మాల్స్ది కూడా ఇదే పరిస్థితి. నెల రోజుల తరువాత మాల్స్ అన్నీ వినియోగదారులతో ఫుల్ అయ్యాయి.
Updated Date - 2021-05-05T05:14:04+05:30 IST