నో ఫస్ట్ ఎయిడ్
ABN, First Publish Date - 2021-10-24T05:24:09+05:30
పాఠశాలలకు ప్రథమ చికిత్స కిట్లు సరఫరా కాకపోవడంతో ఆటలాడే సమయంలో విద్యార్థులు చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది.
పాఠశాలల్లో కనిపించని ప్రథమ చికిత్స కిట్లు
ఆరేళ్లుగా సరఫరా లేని వైనం.. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
ఆటలాడేందుకు జంకుతున్న క్రీడాకారులు
ఏలూరు స్పోర్ట్స్, అక్టోబరు 23 : పాఠశాలలకు ప్రథమ చికిత్స కిట్లు సరఫరా కాకపోవడంతో ఆటలాడే సమయంలో విద్యార్థులు చిన్న చిన్న దెబ్బలు తగిలినా ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది. గాయానికి కట్టు కట్టేందుకు బ్యాండేజీ కూడా లేని పరిస్థితి ప్రస్తుతం పాఠశాలల్లో నెలకుని ఉంది. పాఠశాలల్లో ప్రథమ చికిత్స యూనిట్లు కానరావడం లేదు. ఆరేళ్లుగా ప్రథమ చికిత్స యూనిట్ల సర ఫరా పూర్తిగా ఆగిపోయింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఆటలు ఆడేందుకు వెనుకాడుతున్నారు. క్రీడల శిక్షణ సమయంలో చిన్నపాటి దెబ్బలు తగిలినా ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేవు. కిట్లు అందుబాటులో లేవని సరఫరా పూర్తిగా ఆగిపోయిందని పాఠశాల హెచ్ఎంలు, పీడీ, పీఈటీలు చెబు తున్నారు. ఏలూరు మండలంలో 48 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 24 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఎందరో ఉన్నారు. పాఠశాలలో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండక పోవడంతో వీరంతా ఆటలు ఆడే సమయంలో చిన్నపాటి గాయాల పాలయినా ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది.
పాఠశాలలకు కిట్లు సరఫరా చేయాలి
కె.నాగేంద్రసింగ్, డీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వమే ప్రథమ చికిత్స కిట్లను సరఫరా చేయాలి. ఆటల సమయంలో విద్యార్థులు గాయపడితే ప్రథమ చికిత్స అందించలేక పోతున్నారు. ప్రాథమిక చికిత్స కిట్లతో పాటు మందులూ అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం పీఈటీ, పీడీ లు చొరవ చూపాలి.
Updated Date - 2021-10-24T05:24:09+05:30 IST