మునిసిపల్ ఎన్నికల దిశగా..
ABN, First Publish Date - 2021-04-11T05:47:32+05:30
మునిసిపల్ ఎన్నికల రెండో దశలో సెలక్షన్ గ్రేడ్ హోదా కలిగిన భీమవరం, తాడేపల్లిగూడెం పురపాలక వార్డు రిజర్వేషన్ల ఖరారుకు మున్సిపల్ పరిపాలన విభాగం(డీఎంఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.
భ్రీమవరం, గూడెం మున్సిపాలిటీల్లో వార్డు రిజర్వేషన్ ఖరారుకు నోటిఫికేషన్
రేపటి నుంచి 30 వరకు వార్డుల వారీ సర్వే
భీమవరం, ఏప్రిల్ 10 : మునిసిపల్ ఎన్నికల రెండో దశలో సెలక్షన్ గ్రేడ్ హోదా కలిగిన భీమవరం, తాడేపల్లిగూడెం పురపాలక వార్డు రిజర్వేషన్ల ఖరారుకు మున్సిపల్ పరిపాలన విభాగం(డీఎంఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పురపాలక సంఘాలలో మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల సంఖ్య ఎంత ఉంటుందో తేల్చాలని డీఎంఏ యం.మల్లికార్జుననాయక్ జీవో జారీ చేశారు. ఈ నెల 7న ప్రకటించిన ఎలకో్ట్రలర్ జాబితాలను అనుసరించి ప్రతి వార్డులో పైన పేర్కొన్న నాలుగు విభాగాల గణాంకాలను సేకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. వార్డు రిజర్వేషన్కు సంబంధించి వార్డులలో సర్వే చేసేందుకు ఈ నెల 12 నుంచి 30 వరకు నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. మహిళ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను ఒక విభాగం గాను, బీసీ ఓట్లను మరో విభాగంగాను సర్వే చేయాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల కోసం ఇంటింటి సర్వేకు ఈ నెల 12 నుంచి 19 వరకు వారంపాటు గడువు విధించారు. 20 నుంచి 22వ తేదీ వరకు ఈ గణాంకాలను పురపాలక సంఘం కార్యాలయం వద్ద సిద్ధం చేయాలి. 23న డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేయాలి. మున్సిపాలిటీ, తహసీల్దార్, సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద ఫారం–1 ప్రదర్శించాలి. 24 నుంచి 26వ తేదీ వరకు వీటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27 నుంచి 29వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి, 30న ఫారం–6 తుది జాబితా విడుదల చేయాలి.
బీసీ ఓటర్ల జాబితా
బీసీ ఓటర్లకు ప్రత్యేక బృందం ఈ నెల 12 నుంచి 19 వరకు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారు. ఆ వివరాలను 20 నుంచి 22 వరకు జాబితాను రూపొందిస్తారు. 23న డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. 24 నుంచి 26 వరకు వీటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27న వార్డుల వారీగా అభ్యంతరాలను పరిశీలించి, 28, 29 తేదీలలో పరిష్కరిస్తారు. 30న తుది జాబితాను ప్రకటిస్తారు.
Updated Date - 2021-04-11T05:47:32+05:30 IST