తింటే రుచిరా!
ABN, First Publish Date - 2021-11-25T05:45:02+05:30
చేపల్లో పులస, పండు గొప్పలు ఎంత రుచికరంగా ఉంటాయో.. రామ చేపల రుచి కూడా దీనికి తగ్గదు.
రామ చేపలకు డిమాండ్
తగ్గిన దిగుమతి.. పెరిగిన ఎగుమతి
మార్కెట్లో పెరిగిన ధర
పెద్ద సైజ్ రూ.20 పైనే
నరసాపురం, నవంబరు 24 : చేపల్లో పులస, పండు గొప్పలు ఎంత రుచికరంగా ఉంటాయో.. రామ చేపల రుచి కూడా దీనికి తగ్గదు. ఏడాదిలో నవంబరు, డిసెం బరు నెలల్లో మాత్రమే దొరుకుతాయి.అందుకే ఈ చేపకు మాంస ప్రియులు ఎగబడుతుంటారు.అయితే ఈసారి వీటి ధరలు చుక్కలనంటాయి. చిన్న సైజ్ రామ కూడా రూ.15లపైనే పలుకుతోంది.పెద్దది అయి తే రూ.20 నుంచి రూ.25 ఉంది. మార్కెట్కు సరుకు తక్కు వగా వస్తుండడంతో డిమాండ్ పెరిగింది. ఉప్పు నీటిలో మాత్రమే దొరికే ఈ చేప ఆరోగ్యపరంగా ఎంతో శ్రేష్ఠం. సాధారంగా మిగిలిన చేపల్లో చేదు కట్టును తొలగించి కూర వండుతారు. రామలో మాత్రం చేదు కట్టుతోనే కూర రుచి. ఈ చేదుకట్టును తినడం వల్ల షుగరు, ఉదరంలోని అనేక వ్యాధులు తగ్గుముఖం పడతాయన్న నానుడు ఉంది. అందుకే సీజన్లో కనీసం ఒక రామనైనా తినేందుకు మక్కువ చూపు తారు. గతంలో దీపావళికి ముందే మార్కెట్లోకి విరి విరిగా వచ్చేవి.అయితే ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించలేదు. జిల్లాలో ఎక్కువగా ఉప్పుటేరు, నరసా పురం, మొగల్తూరు, భీమవరం ప్రాంతాల్లోని సముద్ర పాయల్లో లభ్యమవుతుంటాయి. అయితే నవంబరు నుంచి డిసెంబరు వరకు ఎక్కువగా దొరుకుతాయి. ప్రస్తుతం నరసాపురం, మొగల్తూరు మార్కెట్లకు రామ లు వస్తున్నా వాటి ధర మాత్రం సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. రూ.100 పెడితే.. కనీ సం 6 రామలు కూడా రావడం లేదు. ఇటు మొగ ల్తూరు, నరసాపురం మండలాల చెరువుల్లో కూడా వీటిని పండిస్తున్నారు. దీనివల్ల ఉప్పుటేరు, చెరువు ల్లోని రామలకు తేడా తెలియడం లేదు.ఈ చేపలకు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండడంతో వచ్చిన సరుకు ఎగుమతి అయి పోతుంది. పులస మాదిరిగానే రామలను కూడా దూరప్రాంతాల్లో ఉన్న బంధువులకు కూర వండి పం పడం గోదారోళ్ల అనవాయితీ.
Updated Date - 2021-11-25T05:45:02+05:30 IST