కోడి పందేలు నిర్వహించారో..
ABN, First Publish Date - 2021-01-13T06:24:35+05:30
కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ (ఏఆర్) మహేశ్ హెచ్చరించారు.
పోలీసు అధికారుల హెచ్చరికలు
తాళ్లపూడి, జనవరి 12: కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ (ఏఆర్) మహేశ్ హెచ్చరించారు. మండలంలో స్థానిక పోలీసు యంత్రాంగం కోడిపందేలు జరగనివ్వకుండా తీసుకుంటున్న చర్యలపై ఆయన డీఎస్పీ శ్రీనాథ్, రూరల్ సీఐ రమేశ్తో పాటు తాళ్లపూడిలో కోడిపందేల బరులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోళ్లకు కత్తులు కట్టేవారిని జిల్లా వ్యాప్తంగా బైండోవరు చేసి జిల్లా కేంద్రానికి తరలించామన్నారు. ఎక్కడైనా కోడిపందేలు నిర్వహిస్తే భయపడకుండా వీడియోలు తీసి పంపించాలని ప్రజలకు సూచించారు. ఎస్ఐ సతీశ్, పోలీసు, రెవిన్యూ సిబ్బంద ఉన్నారు.
బుట్టాయగూడెం: పోలీసుల హెచ్చరికలను కాదని, కోడిపందేలు, జూద క్రీడల్లో పాల్గొని కేసుల్లో ఇరుక్కోవద్దని ఎస్ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 106 మందిని బైండోవర్ చేశామని, మండలంలో 5 పెద్ద బరులు గుర్తించి హెచ్చరికలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 300 కోడికత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ద్వారకాతిరుమల మండలంలో బరులు ధ్వంసం
ద్వారకాతిరుమల, జనవరి 12: కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ దుర్గా మహేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని వేంపాడు, వెంకట కృష్ణాపురం, రామన్నగూడెం గ్రామాల్లో కోడిపందేలకు ఏర్పాటు చేసిన బరులను పోలీసులు మంగళవారం ధ్వంసం చేశారు.
కోడి పందేల నివారణకు కమిటీలు
కామవరపుకోట, జనవరి 12 : రెవెన్యూ, పోలీస్, సచివాలయాల సంయుక్త ఆధ్వర్యంలో కామవరపుకోట మండలంలోని గ్రామాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదం జరగకుండా కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామగ్రామాన వీఆర్వోలు, సచివాలయ కార్యదర్శులు, వలంటీర్లను కలుపుకుని జూదం జరగకుండా పటిష్టమైన కమిటీలతో పర్యవేక్షణ జరుపుతున్నారు. కోడి పందేలు, జూదం జరగనీయమని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.
Updated Date - 2021-01-13T06:24:35+05:30 IST