అన్నదాతల ఆందోళన
ABN, First Publish Date - 2021-12-04T05:43:05+05:30
వర్షాలకు రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం, సీఐటీయూ నాయకులు చిర్లా పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావు, సిరపరపు రంగారావు డిమాండ్ చేశారు.
పెంటపాడు, డిసెంబరు 3: వర్షాలకు రంగు మారిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం, సీఐటీయూ నాయకులు చిర్లా పుల్లారెడ్డి, బంకూరు నాగేశ్వరరావు, సిరపరపు రంగారావు డిమాండ్ చేశారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం బస్తాలతో శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేమ శాతం నిబంధనలను సడలించాలని, ఆర్బీకేల ద్వారా సంచులు అందజేయాలని, ప్రభుత్వమే రవాణా చార్జీలు భరించి ధాన్యాన్ని కల్లాల నుంచి రైసు మిల్లులకు చేర్చాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలని, దాళ్వా సీజన్లో విత్తనాలు, పురుగుమందులు ఉచితంగా అందజేయాలి డిమాండ్ చేసారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. తేతలి నాగిరెడ్డి, ఎస్వీఎస్ రెడ్డి, కర్రి సాయిరెడ్డి, అడపా ఆంజనేయులు, యండ్రపు కృష్ణ, పెనగంటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్: కల్లాల్లో ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతుకు పూర్తి మద్దతు ధర అందించాలని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. మాధవరంలో కల్లాల్లో ధాన్యం రాశుల వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. కౌలు రైతులు వేమూరి భాస్కరరావు, డొంకా వెంకట్రావు, నాగల నాగరాజు, ఎిలిపే నాగేశ్వరరావు, దేవిశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-04T05:43:05+05:30 IST