ఎయిడెడ్
ABN, First Publish Date - 2021-10-26T04:13:53+05:30
ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాలలు మూతపడనున్నాయి.
ఎయిడెడ్ పాఠశాలలు మూత
కనుమరుగుకానున్న చరిత్ర కలిగిన పాఠశాలలు
ప్రభుత్వ పాఠశాలలకు ఇక్కడి ఉపాధ్యాయుల సర్దుబాటు
నిడదవోలు, అక్టోబరు 25: ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్ పాఠశాలలు మూతపడనున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల కొరత, ఉపాధ్యాయుల కొరత వల్ల వీటిని రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తున్నది. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలలు మూతపడుతుండగా ఒక్క నిడదవోలు పట్టణ మండలంలోనే ఐదు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన పాఠశాలలు కూడా ఉన్నాయి. పట్టణంలోని గాంధీనగర్ శింగవరం రోడ్డులో సెయింట్ ఆన్స్ తెలుగు మీడియం, సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ పాఠశాలలు 1967 ఆగస్టులో రోమన్ కేథలిక్ మిషనరీలు ఎయిడెడ్ పాఠశాలలను ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో విద్యను అభ్యసించిన అనేక మంది ఉన్నతస్థానాల్లో ఉన్నారు. మూతపడున్న వాటిలో ఈ పాఠశాల కూడా ఉండడంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను ఈ నెలాఖరు నాటికి మూసేవిధంగా ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు టీసీలు సైతం ఇచ్చివేశారు. దీంతో విద్యార్థుల తల్లితండ్రులలో ఆందోళన మొదలైంది. విద్యాసంవత్సరం మధ్యలో మూసివేస్తుండడంతో విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లల టీసీలతో మరో పాఠశాలలకు క్యూ కడుతున్నారు. అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా వచ్చే నెల 7వ తేదీ ఈ పాఠశాలల్లో ఆఖరి పనిదినమని ఆ రోజు వారికి ఏ పాఠశాలలకు బదిలీ చేస్తారో జాబితా రానుంది. ఇలా ఎయిడెడ్ పాఠశాలల శకం ముగియనుంది.
54 ఏళ్ళ ఘన చరిత్ర ఉన్న సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్ శకం కూడా ముగిసింది. ఒకప్పుడు ఈ పాఠశాలలో విద్యార్థికి సీటు దొరకడం అంటే అదో గొప్పగా భావించేవారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన చేసేందుకు సుమారు 20 మంది ఉపాధ్యాయులు, నలుగురు నాన్ టీచింగ్ స్టాఫ్, ఒక కరస్పాడెంట్తో వందల మంది విద్యార్థులతో సుమారు ఆరు ఎకరాల స్థలంలో లైబ్రరీ, లాబ్, ఆడిటోరియమ్ వంటి సాంకేతిక నైపుణ్యంతో విరాజిల్లింది. మూతపడుతున్న పాఠశాలల్లో ఇది కూడా ఉన్నది. పట్టణం, మండలంలో సెయింట్ ఆంబ్రోస్ హైస్కూల్, సెయింట్ ఎయిడెడ్ స్కూల్, హెచ్ఎపిఎస్, బసివిరెడ్డిపేట, హెచ్ఎపిఎస్, రాయిపేట, హిందూ పాఠశాల, అట్లపాడు పాఠశాలలు మూతపడనున్నాయి. ఈ పాఠశాలల్లో 227 మంది విద్యను అభ్యసిస్తున్నారు.
Updated Date - 2021-10-26T04:13:53+05:30 IST