రామతీర్థంలో నేటి నుంచి నవమి వేడుకలు
ABN, First Publish Date - 2021-04-13T04:46:59+05:30
రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో మంగళవారం నుంచి శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. చైత్ర శుద్ధ పాఢ్యమిని పురస్కరించుకుని ఆర్చక స్వాములు తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి
నెల్లిమర్ల, ఏప్రిల్ 12: రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో మంగళవారం నుంచి శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. చైత్ర శుద్ధ పాఢ్యమిని పురస్కరించుకుని ఆర్చక స్వాములు తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తొమ్మిదో రోజు శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 40 మంది రుత్విక్కులతో రామాయణం, సుందరకాండ పారాయణ, దివ్య ప్రబంధ సేవాకాలాలు నిర్వహించనున్నారు. సీతారామచంద్ర ఉత్సవమూర్తులకు అత్యంత వైభోగంగా అభిషేకం చేయనున్నారు. 22న శ్రీరామ చంద్రస్వామి వారికి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని శాస్ర్తోక్తంగా జరపనున్నారు. అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్, గొడవర్తి నరసింహాచార్యులు, పవన్కుమార్, పాణంగిపల్లి ప్రసాద్ పర్యవేక్షణలో పూజాది కార్యక్రమాలు జరగనున్నాయి. దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తోటపల్లిలో...
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో మంగళవారం నుంచి వసంత నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో బి.లక్ష్మీనగేష్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆలయ అర్చకులు పీవీ గోపాలకృష్ణమాచార్యులు, వీవీ అప్పలాచార్యులు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 21న శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. స్వామివారి కల్యాణంలో పాల్గొనే భక్తులు రూ.500 చెల్లించాలని ఈవో పేర్కొన్నారు. భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.
Updated Date - 2021-04-13T04:46:59+05:30 IST