పోలమాంబ చదురుగుడి విస్తరణకు శ్రీకారం
ABN, First Publish Date - 2021-06-13T05:19:30+05:30
ఉత్తరాంద్రుల ఆరాధ్య దైవం, భక్తుల కల్పవల్లిగా పేరుగాంచిన శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ విస్తరణకు తొలి అడుగు పడింది.
మక్కువ, జూన్ 12 : ఉత్తరాంద్రుల ఆరాధ్య దైవం, భక్తుల కల్పవల్లిగా పేరుగాంచిన శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ విస్తరణకు తొలి అడుగు పడింది. అమ్మవారి చదురుగుడి విస్తరణలో భాగంగా తూర్పు వైపు ఉన్న నివాస గృహాల యజమానులతో ఆలయ ఈవో బీఎల్ నగేష్, గ్రామ పెద్దలు శనివారం సమావేశం నిర్వహించారు. ఆలయానికి ఆనుసరించి ఉన్న ప్రత్తి గంగయ్య, నైదాన నరసింహులుకు చెందిన ఇళ్లు దేవదాయ ధర్మదాయశాఖకు ఇవ్వాలని కోరారు. ప్రతిఫలంగా 200 గజాల ప్రభుత్వ ఖాళీ స్థలంతో పాటు రూ. 30 లక్షలు నగదు ఇచ్చేందుకు ప్రతిపాదించగా ప్రత్తి గంగయ్య కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మరో నివాస గృహ యజమాని నైదాన నరసింహులు ప్రతిపాదనకు అంగీకరించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయానికి అనుసరించిన ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదించామని ఈవో తెలిపారు. దశాబ్దాల తరబడి జనావాసాల మధ్య ఉన్న పోలమాంబ అమ్మవారి చదురు గుడి అభివృద్ధికి అడుగులు పడడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-06-13T05:19:30+05:30 IST