YSRCP సీనియర్ నాయకుడికి ఎట్టకేలకు అదృష్టం!
ABN, First Publish Date - 2021-11-13T04:14:01+05:30
వైసీపీ సీనియర్ నాయకుడు ఇందుకూరి రఘురాజుకు ఎట్టకేలకు అదృష్టం వరించింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించింది. ఎస్.కోట నియోజకవర్గం నుంచి రఘురాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించినా చుక్కెదురయ్యింది.
- ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇందుకూరి రఘురాజు
- స్థానిక సంస్థల నుంచి పోటీకి ఎంపిక
శృంగవరపుకోట, నవంబరు 12: వైసీపీ సీనియర్ నాయకుడు ఇందుకూరి రఘురాజుకు ఎట్టకేలకు అదృష్టం వరించింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా అధిష్టానం ఆయనకు అవకాశం కల్పించింది. ఎస్.కోట నియోజకవర్గం నుంచి రఘురాజు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించినా చుక్కెదురయ్యింది. దీంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీచేసి టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో గట్టిగానే తలపడ్డారు. గణనీయమైన ఓట్లు సాధించారు. 2014లో కాంగ్రెస్ టిక్కెట్పై పోటీచేశారు. విభజనతో కాంగ్రెస్ పార్టీపై ప్రజాగ్రహం మిన్నంటినా డిపాజిట్లు దక్కించుకోగలిగారు. జిల్లాలో ఎక్కువ ఓట్లు సాధించిన కాంగ్రెస్ అభ్యర్థిగా గుర్తింపు పొందారు. అటు తరువాత బీజేపీలో చేరారు. 2019 ఎన్నికల ముందు మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపు మేరకు వైసీపీలో చేరారు. టీడీపీ కంచుకోట శృంగవరపుకోటలో వైసీసీ జెండా ఎగరవేస్తే ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తామని స్వయంగా జగన్ హమీ ఇచ్చినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. దీంతో అప్పటి నుంచి ప్రతి శాసన మండలి నోటిఫికేషన్ సమయంలోనూ రఘురాజు పేరు పేరు ఉంటుందేమోనని అతనితో పాటు అనుచరులు ఎదురు చూడడం పరిపాటిగా మారింది. రెండు నెలల కిందట నామినేటేడ్ పదవుల పంపకం సమయంలో రాష్ట్ర స్థాయి పదవికి జిల్లా నుంచి ప్రతిపాదన వెళ్లింది. ఈ జాబితాను పరిశీలించిన సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్వయంగా రఘురాజుకు చేప్పినట్లు స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నాయకులు, కార్యకర్తల వద్ద ప్రస్తావించారు. దీంతో రఘురాజుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. శుక్రవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డ్డి ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్ధుల జాబితాలో రఘురాజు పేరు ఉంది. దీంతో ఆయన అనుచరులు ఆనందంలో మునిగిపోయారు. స్వగ్రామం బొడ్డవరలో సంబరాలు మిన్నంటాయి.
Updated Date - 2021-11-13T04:14:01+05:30 IST