భస్మీపటలం!
ABN, First Publish Date - 2021-03-06T04:20:46+05:30
వారంతా వ్యవసాయ కూలీలు. పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంటి వద్ద పిల్లలు, వృద్ధులే ఉన్నారు. ఆ సమయంలో ఎగసిపడిన అగ్గిరవ్వలు ఇళ్లపై పడ్డాయి. క్షణాల్లో 40 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పండించిన పంటలు, విలువైన పత్రాలు, భవిష్యత్ అవసరాలకు ఉంచుకున్న నగదు,
కొండవానిపాలెంలో భారీ అగ్ని ప్రమాదం
40 ఇళ్లు దగ్ధం
రూ.40 లక్షల ఆస్తినష్టం
కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
బొండపల్లి, మార్చి 5: వారంతా వ్యవసాయ కూలీలు. పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంటి వద్ద పిల్లలు, వృద్ధులే ఉన్నారు. ఆ సమయంలో ఎగసిపడిన అగ్గిరవ్వలు ఇళ్లపై పడ్డాయి. క్షణాల్లో 40 ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పండించిన పంటలు, విలువైన పత్రాలు, భవిష్యత్ అవసరాలకు ఉంచుకున్న నగదు, బంగారం ఇలా సర్వస్వం బూడిదయ్యాయి. కొండవానిపాలెంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సంభవించిన అగ్నిప్రమాదంలో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కొండవానిపాలెంలో అందరూ గిరిజనులే. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గ్రామస్థులందరూ పొలం పనులకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కరాసి కుమారి అనే మహిళ ఇంటి పక్కనే తుప్పల నుంచి అగ్గిరవ్వలు ఎగసిపడ్డాయి. ముందుగా కుమారి ఇంటికి మంటలు వ్యాపించాయి. ఎవరూ గ్రహించలేకపోవడంతో మిగతా ఇళ్లకు వ్యాపించాయి. పొలం పనుల్లో ఉన్న గ్రామస్థులు చూసి పరుగుపరుగున వచ్చి మంటలను అదుపుచేశారు. గజపతినగరం అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. వారు చేరుకునేసరికే 40 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. గ్రామంలో మూడు వీధుల్లో 50 ఇళ్లు ఉండగా...40 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. కాలిన ఇళ్ల వద్ద బాధితులు కన్నీరుమున్నీరుగా రోదిస్తూ తాము దాచుకున్న నగదు, బంగారం, పత్రాల కోసం వెతుకులాడడం కలచివేసింది. కష్టపడి దాచుకున్న నగదు, బంగారం కాలిపోయిందని కరాసి రామారావు, రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దారు సీతారామరాజు, వీఆర్వో నాగరాజు గ్రామానికి చేరుకున్నారు. రూ.40 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు గుర్తించారు. గ్రామపెద్దలు బాధితులకు భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆర్డీవో భవానీశంకర్ గ్రామాన్ని సందర్శించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Updated Date - 2021-03-06T04:20:46+05:30 IST