కళ తప్పిన జాతర్లు
ABN, First Publish Date - 2021-01-17T05:16:15+05:30
గ్రామ దేవతల జాతర్లపైనా కరోనా ప్రభావం పడింది. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు ప్రతిచోటా నో చెప్పడంతో నిర్వాహకులు నిరాశ పడుతున్నారు. ఈ పరిణామంతో పల్లెల్లో ప్రస్తుతం జరుగుతున్న తీర్థాల్లో జనం పలుచగా హాజరవుతున్నారు.
కొవిడ్ నిబంధనలతో స్టేజ్ షోలకు అనుమతివ్వని పోలీస్ శాఖ
అంతంతమాత్రంగా జనం హాజరు
శృంగవరపుకోట జనవరి 16:
గ్రామ దేవతల జాతర్లపైనా కరోనా ప్రభావం పడింది. సెక్షన్ 30 అమల్లో ఉందంటూ పోలీసులు ప్రతిచోటా నో చెప్పడంతో నిర్వాహకులు నిరాశ పడుతున్నారు. ఈ పరిణామంతో పల్లెల్లో ప్రస్తుతం జరుగుతున్న తీర్థాల్లో జనం పలుచగా హాజరవుతున్నారు. తీర్థాల్లో కాలక్షేపానికి ఏర్పాటు చేసే స్టేజీ డ్రామాలు, నాటికలు, సంస్కృతిక పదర్శనలు ఎక్కడా కనిపించడం లేదు. సంక్రాంతి నుంచి పల్లెల్లో గ్రామ దేవతల పేరున తీర్థాలు (జాతర)లు ప్రారంభం కావడం ఆనవాయితీ. జిల్లాలో శ్రీరామనవమి వరకు నిత్యం ఎక్కడోచోట జరుగుతూనే ఉంటాయి. ఎక్కవ మంది ప్రజలు ఒకే చోట దగ్గరగా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. చట్టవ్యతిరేక కార్యకలాపాలైన కోడి, పొట్టెల పందాళ్లు.. పేకాట, బల్లాటను నిషేధించింది. నలుగురు ఒక చోట గుమిగూడేందుకు కూడా అభ్యంతరం చెప్పడంతో తీర్థాలు కళతప్పుతున్నాయి. అయితే ముందు, ముందు స్థానిక ఎన్నికలు ఉండడంతో అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా చూసీచూడనట్లు పోవాలని పోలీస్లను కోరుతున్నారు. వీరు మాత్రం ఇందుకు ససేమేరా అంటున్నారు. కొవిడ్ నిబంధనలను పాటించకతప్పదని తెల్చిచెబుతున్నారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున కోడి, పొట్టేళ్ల పందాలు, పేకాట వంటి వాటిని జరగనివ్వకుండా చూడాలని ఎస్పీ ఆదేశాలు ఉన్నాయని, కొవిడ్ నిబంధనలను అనుసరించి గ్రామ దేవతల తీర్థాలను ప్రజలు జరుపుకోవాలని ఎస్.కోట ఎస్ఐ కె.నీలకంఠం చెప్పారు.
Updated Date - 2021-01-17T05:16:15+05:30 IST