ఇనుప కోలమ్ మీద పడి యువకుడి మృతి
ABN, First Publish Date - 2021-10-24T04:35:48+05:30
ఇనుప కోలమ్ మీద పడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు పాలిటెక్నిక్ విద్యార్థి
పరవాడ, అక్టోబరు 23 : ఇనుప కోలమ్ మీద పడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఈ- బోనంగి రెవెన్యూ పరిధి ఇండస్ట్రియల్ పార్కులోని లక్ష్మీప్రసన్న ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి దరి గవరపాలేనికి చెందిన పొలమరశెట్టి రోహిత్ గణేశ్(19) కాకినాడలోని ఓ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇక్కడి ఇండస్ట్రియల్ పార్కులోని లక్ష్మీప్రసన్న ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీలో 15 రోజుల క్రితం హెల్పర్గా చేరాడు. ఎప్పటిలాగే శనివారం విధులకు హాజరయ్యాడు. కంపెనీలో తయారైన ఇనుప కోలమ్స్ను క్రేన్ సహాయంతో ట్రాలర్లోకి లోడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కోలమ్ జారిపోయి ఆ యువకుడిపై పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. సీఐ ఈశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-10-24T04:35:48+05:30 IST