అధికారుల తీరుపై మంత్రి మండిపాటు
ABN, First Publish Date - 2021-01-21T04:54:00+05:30
ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపికతో పాటు ఇతర పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు గ్రామసభలు నిర్వహించడంలో అధికారులు తాత్సారం చూపడంపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకటో తేదీలోగా గ్రామసభలు నిర్వహించాలని ఆదేశం
పద్మనాభం, జనవరి 20: ఇళ్ల స్థలాల లబ్ధిదారుల ఎంపికతో పాటు ఇతర పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు గ్రామసభలు నిర్వహించడంలో అధికారులు తాత్సారం చూపడంపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాపురంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఆయన ఎన్ని గ్రామాల్లో గ్రామసభలు పెట్టారని అధికారులను ప్రశ్నించారు. ఇంకా గ్రామసభలు ఏర్పాటు చేయలేదని వారు బదులివ్వడంతో మండిపడ్డారు. ఇప్పటికీ చాలామంది నిజమైన అర్హులు ఇళ్ల స్థలాలు లేకుండా ఉన్నారని, ఇతర పథకాలూ పొందలేదని.. వారందరి కోసం ఫిబ్రవరి ఒకటిలోగా గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను గుర్తించాలని మండల ప్రత్యేకాధికారి రాజేశ్వరి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో చిట్టిరాజులకు ఆదేశించారు. కాగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపిక జాబితాను మంత్రి అడిగినా స్థానిక సచివాలయ ఉద్యోగులు అందించలేకపోయారు.
Updated Date - 2021-01-21T04:54:00+05:30 IST