సంచి చిరిగింది!
ABN, First Publish Date - 2021-11-22T06:20:31+05:30
జగనన్న విద్యాకానకుల కింద ప్రభుత్వం విద్యార్థులకు నాసిరకం బ్యాగులు పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు బ్యాగులు అందచేసిన నెలరోజులకే చిరిగిపోయాయి. జిప్లు పనిచేయడం లేదు.
నాసిరకంగా జగనన్న విద్యాదీవెన బ్యాగులు
నెలరోజులకే ఊడిపోయిన జిప్పులు
ప్రచార ఆర్భాటమే తప్ప నాణ్యత లేదని విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ
(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం/ కశింకోట/ నాతవరం/ గాజువాక)
జగనన్న విద్యాకానకుల కింద ప్రభుత్వం విద్యార్థులకు నాసిరకం బ్యాగులు పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులకు బ్యాగులు అందచేసిన నెలరోజులకే చిరిగిపోయాయి. జిప్లు పనిచేయడం లేదు.
దీంతో కొన్నిచోట్ల చిరిగిన బ్యాగులతో విద్యార్థులు పాఠశాలలకు వస్తుండగా, మరికొన్ని చోట్ల పాత బ్యాగులతో హాజరవుతున్నారు. జగనన్న విద్యాకానుల కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాగు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ, బెల్టు, బూట్లు, సాక్సులు కిట్ రూపంలో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో ఈ ఏడాది ఒకటి నుంచి పదో తరగతి వరకు 3,63,144మంది విద్యార్థులకు కిట్లు అందజేశారు. కరోనా ప్రభావంతో ఆగస్టు 17 నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో సెప్టెంబరు నెలాఖరు వరకు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అయితే ఈ ఏడాది అందించిన బ్యాగులు నాసిరకంగా ఉన్నాయని ఆదిలోని చాలామంది ఉపాధ్యాయులు అధికారులకు ఫిర్యాదుచేశారు. అయితే సెంట్రలైజ్జ్ కొనుగోలు కావడంతో జిల్లాస్థాయి విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేకపోయారు. పంపిణీ చేసిన నెలరోజులకే చాలాచోట్ల బ్యాగులు చిరిగిపోవడం, లేదా జిప్లు పనిచేయకుండా పోవడంతో టీచర్లకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కొన్నిచోట్ల చిరిగిపోయిన బ్యాగులు వెనక్కి ఇచ్చేశారు. మరికొన్నిచోట్ల ఉపాధ్యాయులు నచ్చచెప్పడంతో చిరిగిన బ్యాగులతోనే పాఠశాలలకు వస్తున్నారు. నాణ్యతలేని బ్యాగులు అందించడంతోనే ఈ దుస్థితి దాపురించిందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాల బరువుకు ఇచ్చిన మూడు రోజుల్లోనే జిప్పులు ఊడిపోయాయని, తరువాత బ్యాగులు పూర్తిగా చిరిగిపోయాయని చెబుతున్నారు. జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేశామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ పెద్దలు ఇలా నాసిరకం బ్యాగులను అందించారని మండిపడుతున్నారు.
Updated Date - 2021-11-22T06:20:31+05:30 IST