స్టీల్ప్లాంటులో తగ్గిన కోక్ ఉత్పత్తి
ABN, First Publish Date - 2021-10-21T06:05:35+05:30
సాంకేతిక సమస్యల వల్ల స్టీల్ ప్లాంటులో కోక్ ఉత్పత్తి తగ్గిపోయింది.
రోజూ బయట రెండు వేల టన్నుల కొనుగోలు
విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక సమస్యల వల్ల స్టీల్ ప్లాంటులో కోక్ ఉత్పత్తి తగ్గిపోయింది. స్టీల్ ఉత్పత్తికి అవసరమైన ఇతర ముడి పదార్థాల సమస్య ఏమీ లేదు. ఆస్ర్టేలియా నుంచి కోల్ ఇంతకు ముందులాగే దిగుమతి అవుతోంది. అయితే కోక్ ఓవెన్లో తయారయ్యే కోక్ అవసరాలకు సరిపడా తయారుకావడం లేదు. దాంతో గత రెండు రోజులుగా బయట మార్కెట్లో రోజుకు రెండు వేల టన్నుల కోక్ కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కోక్ ఓవెన్ బ్యాటరీల నిర్వహణపై అధికారులు దృష్టి సారించలేకపోయినట్టు సమాచారం. మొత్తం ఐదు కోక్ ఓవెన్ బ్యాటరీలు ఉండగా, వాటిలో రెండు సక్రమంగా సేవలు అందించడం లేదని కార్మిక వర్గాల ద్వారా తెలిసింది. అలాగే మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా వాటిలో మూడవది మాత్రమే పనిచేస్తుండగా, 1, 2 ఫర్నేసుల్లో సమస్యలు తలెత్తినట్టు సమాచారం. మొదటి బ్లాస్ట్ ఫర్నేస్లో రోజుకు ఆరు వేల టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, బుధవారం కేవలం 850 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరిగింది. ప్రస్తుతం ప్లాంటుకు రూ.22 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. వాటిపై 9.1 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ప్రతి నెలా రూ.2,100 కోట్ల నుంచి రూ.2,500 కోట్ల విలువైన ఉక్కు ఉత్పత్తులు విక్రయిస్తే ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు. గత కొద్దినెలలుగా మార్కెట్ అనుకూలంగా వుండడంతో అమ్మకాలు బాగానే సాగుతున్నాయి. స్టీల్ రేట్లు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉత్పత్తి తగ్గినందున...ఆ ప్రభావం అమ్మకాలపై పడుతుందేమోనని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
మరో 43 మందికి కరోనా
విశాఖపట్నం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరో 43 మందికి కరోనా వైరస్ సోకినట్టు బుధవారం నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,57,897కు చేరింది. ఇందులో 1,55,997 మంది కోలుకోగా, మరో 806 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, కొవిడ్బారినపడి ఇప్పటివరకు 1,094 మంది మృతిచెందారు.
Updated Date - 2021-10-21T06:05:35+05:30 IST