జాతీయ స్థాయి కర్రసాము పోటీలు ప్రారంభం
ABN, First Publish Date - 2021-10-22T04:15:06+05:30
ఆంధ్రప్రదేశ్ సిలంభం (కర్రసాము) అసోసియేషన్ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సిలంభం చాంపియన్ షిప్ పోటీలు గురువారం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి.
ఆరు రాష్ట్రాల నుంచి 350 మంది ఔత్సాహికుల ప్రాతినిధ్యం
విశాఖపట్నం (స్పోర్ట్సు), అక్టోబరు 21: ఆంధ్రప్రదేశ్ సిలంభం (కర్రసాము) అసోసియేషన్ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సిలంభం చాంపియన్ షిప్ పోటీలు గురువారం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. పోటీలను రాష్ట్ర సిలంభం సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్దేవ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలుర, బాలికల విభాగాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిసున్న ఈ టోర్నీలో ఆతిథ్య ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ర్టాలకు చెందిన సుమారు 350 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.
సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, సింగిల్ శూరుల్ వాల్, డబుల్ శూరుల్ వాల్, వేల్ కంబు, మాన్ కంబు, వాల్ వీచు, తోడు సిలంభం స్టైల్స్కు చెందిన ఈవెంట్లలో పోటీలు జరుగుతాయన్నారు. వరల్డ్ యూనియన్ సిలంభం ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ మురుగన్ సతీష్ నేతృత్వంలో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎన్.నాగేశ్వరరావు, ఏసియన్ అథ్లెటిక్స్ చాంపియన్ ఎస్.శ్రీనివాసరావు, ఇంటర్నేషనల్ అథ్లెట్ బి.శ్యాంసుందరరావు, పి.భాగ్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T04:15:06+05:30 IST