‘వానర’కం!
ABN, First Publish Date - 2021-01-22T05:12:20+05:30
మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద మరింత అధికమైంది.
‘పేట’ మండలంలోని పలు గ్రామాల్లో గుంపులుగా సంచారం
ఇళ్లపై తిష్ఠ .. కనిపించిన వస్తువులతో పరుగు
మొక్కలు, ఆరబెట్టిన దుస్తులు చిందరవందర
బేజారెత్తిపోతున్న జనం
పాయకరావుపేట రూరల్, జనవరి 21 : మండలంలోని పలు గ్రామాల్లో కోతుల బెడద మరింత అధికమైంది. సత్యవరం, మంగవరం, అరట్లకోట, గోపాలపట్నం, మాసాహెబ్పేట, పెదరామభద్రపురం, శ్రీరాం పురం తదితర గ్రామాల్లో ఒకప్పుడు చెరకు, అరటి తోటలను రైతులు ఎక్కువగా సాగు చేసేవారు. కోతులు గుంపులుగా సంచరిస్తూ పంటలను పాడు చేస్తుండడంతో నష్టాలను చవిచూసేవారు. దీంతో కొందరు ఇటువంటి పంటల సాగుకు క్రమక్రమంగా దూరమయ్యారు. ఇదిలావుంటే, ఒకప్పుడు పొలాలు, తోటల్లోనే దర్శనమిచ్చే కోతులు ఇప్పుడు గ్రామాల్లోకి ప్రవేశించాయి. ఇళ్ల వద్ద వస్తువులను చిందరవందర చేస్తుండడం, పూల మొక్కలు, పాదులను పీకి పారేస్తుండడం, డాబాలపై ఆరబెట్టిన దుస్తులను లాక్కుపోవడం వంటివి చేస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. నానాటికీ వీటి బెడద అధికమైందని, ఇంటినుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉందని చెపుతున్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టి తీసుకు వెళ్లినా ఫలితం లేకపోయిందన్నారు. ఉన్నతాధికారులు వీటి బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.
Updated Date - 2021-01-22T05:12:20+05:30 IST