రిజర్వాయర్లో పడి వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-21T06:17:51+05:30
మనస్తాపంతో ఓ వ్యక్తి మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లో పడి మృతి చెందాడు.
గోపాలపట్నం, అక్టోబరు 20: మనస్తాపంతో ఓ వ్యక్తి మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లో పడి మృతి చెందాడు. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేపగుంట అప్పలనరసయ్య కాలనీకు చెందిన వంకాయల సంతోశ్ పవన్ (32) అనే వ్యక్తి ఫార్మాసిటీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు అప్పలనరసయ్య కాలనీలో నివాసిస్తుండగా.. సంతోశ్ పవన్ మాత్రం నగరంలోని సీతమ్మధారలోని అక్కాబావల వద్ద ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం వేపగుంట వెళుతున్నట్టు అక్కకు చెప్పిన సంతోశ్పవన్ ఆచూకీ బుధవారం ఉదయం వరకు తెలియకపోవడంతో కుటుంబీకులు ఆందోళన చెంది గాలించసాగారు. కాగా బుధవారం ఉదయం మేహాద్రిగెడ్డ రిజర్వాయర్ స్పిల్వే వద్ద మృతదేహాన్ని గుర్తించిన రిజర్వాయర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి తమకు లభ్యమైన ఆధారాల ద్వారా కుటుంబీకులకు సమాచారం అందించారు. గతంలో విదేశాల్లో ఉద్యోగం చేసిన సంతోశ్ పవన్ మళ్లీ విదేశాలకు వెళ్లడానికి యత్నిస్తుండగా ఆర్ధిక ఇబ్బందుల వల్ల కుదరలేదు. అలాగే వివాహం కాలేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడని, అందుకే మృతి చెంది ఉంటాడని కుటుంబీకులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-10-21T06:17:51+05:30 IST