కశింకోట రైల్వే గేటు మూసివేత
ABN, First Publish Date - 2021-10-19T06:21:09+05:30
మరమ్మతుల కారణంగా కశింకోట రైల్వే గేటును సోమవారం మూసివేశారు.
సమాచారం ఇవ్వకపోవడంపై ప్రజల ఆగ్రహం
పలు గ్రామాలకు రాకపోకలు బంద్
కశింకోట, అక్టోబరు 18: మరమ్మతుల కారణంగా కశింకోట రైల్వే గేటును సోమవారం మూసివేశారు. ఈ నెల 21వ తేదీ వరకు తెరవకూడదని రైల్వే అధికారులు నిర్ణయించారు. దీంతో కశింకోట, అనకాపల్లి మండలం సంపతిపురం, చినసంపతిపురం, తమ్మయ్యపేట, అచ్చెయ్యపేట తదితర గ్రామాల ప్రజలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అయితే దీనిపై ముందస్తు సమాచారం తెలపకపోవడంపై ఆయా ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కశింకోట వాసులు ఆయా ప్రాంతాలకు పిసినికాడ, కొత్తూరు గ్రామాల మీదుగా ప్రయాణిస్తున్నారు. అలాగే పొలాల్లో పండించిన ఉత్పత్తులను రైతులు ఈ గేటు మీదుగానే తీసుకొస్తుంటారు. ఎటువంటి సమాచారం లేకుండా గేటు మూసివేయడంతో వారంతా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎమర్జెన్సీగా రైలు పట్టాల మధ్యలో ఉన్న స్లీపర్సు, బద్దీలు, కంకర మార్చాల్సి రావడంతో గేటు మూసివేయడం జరిగిందని రైల్వే అధికారులు చెప్పారు. మరమ్మతులు కారణంగా విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-విజయవాడ వైపునకు వెళ్లే రైళ్లు నెమ్మదిగా నడిచాయి.
Updated Date - 2021-10-19T06:21:09+05:30 IST