మండిపోతున్న కూరగాయలు
ABN, First Publish Date - 2021-10-13T06:23:55+05:30
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
నెల వ్యవధిలో ధరలు రెట్టింపు
టమాటా రూ48, బీరకాయలు రూ.46, దొండకాయలు రూ.38
ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినడమే కారణం
బయట మార్కెట్లలో మరింత ప్రియం
(విశాఖఫట్నం-ఆంధ్రజ్యోతి)
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలో అనేక రకాల రేట్లు రెట్టింపు అయ్యాయి. ఇటీవల వచ్చిన గులాబ్ తుఫాన్ వల్ల స్థానికంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఇతర ప్రాంతాల్లోను వర్షాలు అధికంగా కురవడంతో నగరానికి వచ్చే కూరగాయలు బాగా తగ్గిపోయాయి. దానికి తోడు దుర్గా నవరాత్రులు, అయ్యప్ప పూజలు ప్రారంభం కావడంతో శాకాహారానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రేట్లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రైతుబజార్లలో నెల క్రితం టమాటా ధర కిలో రూ.19 ఉండగా, ఇప్పుడు రూ.48 పలుకుతోంది. బీరకాయల ధర రూ.26 నుంచి రూ.46కి చేరింది. బహిరంగ మార్కెట్లో అయితే రూ.60 చొప్పున అమ్ముతున్నారు. వంకాయల ధర రూ.18 ఉండగా, ఇప్పుడు రూ.34కి చేరింది. దొండకాయల రేటు రూ.29 నుంచి రూ.38కి పెరిగింది. బెండకాయల ధర నెల క్రితం కిలో రూ.12 ఉండగా...ఇప్పుడు రూ.32 ఉంది.
మారు వర్తకులే తీసుకుపోతున్నారు
వీధుల్లో బండ్లపై కూరగాయలు అమ్ముకునే వర్తకులు హోల్సేల్ మార్కెట్కు వెళ్లకుండా తెల్లవారుజామున ఆరు గంటలకే రైతుబజార్లకు వస్తున్నారు. బోర్డు రేటు కంటే రూ.2 అధికంగా చెల్లించి డిమాండ్ కలిగిన కూరగాయలను బస్తాలతో కొని తీసుకుపోతున్నారు. ఈ విధంగా బీర, బెండ, టమాటా, బరబాటి, వంకాయలు, దొండకాయలు వంటి రకాలు తరలిపోతున్నాయి. ఉదయం 7 గంటల తరువాత వచ్చిన వినియోగదారులకు ఏ కూరగాయలు దొరకడం లేదు. వాస్తవానికి ఉదయం పది గంటల తరువాతే హోటల్ నిర్వాహకులను, మెస్ యజమానులను బజార్లలో టోకున సరకు కొనడానికి అనుమతించాలి. కానీ వారు ముందే రైతులతో మాట్లాడుకొని సరకును పక్కన పెట్టించుకుంటున్నారు. కిలో చొప్పున అమ్మితే ఎప్పటికి సరకు పూర్తవుతుంది? అంటూ రైతులు, డ్వాక్రా సంఘాలు వారు కూడా మారు వర్తకులు, హోటళ్లకు బస్తాల లెక్కన అమ్మేసుకుంటున్నారు. వీటిని రైతుబజార్లలో సిబ్బంది నియంత్రించాల్సి ఉన్నా...వారి వల్ల కావడం లేదు. ఒక వైపు నిఘా, కాపలా పెడితే మరో వైపు నుంచి తీసుకుపోతున్నారు. దీంతో సాధారణ ప్రజలకు రైతుబజార్లలో కూరగాయలు దొరకడం లేదు. అవే సరకులు బయట మార్కెట్లో మరింత అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. అధికారులు ఈ వ్యవహారాలకు చెక్ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.
ఆకు కూరలు గోంగూరు, తోటకూర మాత్రమే లభిస్తున్నాయి. ఇవి కూడా ధర ఎక్కువగా వున్నాయి. పాలకూర, చుక్కకూర, మెంతికూర, బచ్చలికూర రైతుబజార్లలో లభించడంలేదు. కొత్తిమీర మధ్యరకం కట్ట రూ.10కి అమ్ముతున్నారు. బెంగళూరు, ఒడిశా నుంచి వస్తున్నదని అమ్మకందారులు చెబుతున్నారు. పుదీనా నాసిరకంగా వుంది. చిన్న కట్ట రూ.5కి అమ్ముతున్నారు. పుదీనా రాజమహేంద్రవరం నుంచి వస్తున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆకు కూర పంటలన్నీ పాడైపోయాయి. ఈ వారంలో మళ్లీ విత్తనాలు వేసినట్టు రైతులు చెబుతున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఆకు కూరలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
కూరగాయ 11-9-21న 11-10-21న
రకం ధరలు ధరలు
(కిలో రూ.లలో) (కిలో రూ.లలో)
ధరలు పెరిగినవి..
టమాటా 19 48
బంగాళాదుంపలు 14 22
బీరకాయలు 26 46
బెండకాయలు 12 32
బరబాటి 20 40
వంకాయలు (వైట్) 18 34
వంకాయలు(బ్లాక్) 22 34
కాప్సికమ్ 34 60
దొండకాయలు 20 38
గోరుచిక్కుడు 22 28
దేముడుచిక్కుడు 42 60
కాకర కాయలు 20 34
పచ్చి బఠాణి 90 120
పొటల్స్ 46 60
మునక్కాడలు 40 66
ఆనపకాయ(1) 18 24
పొట్లకాయ(1) 14 18
Updated Date - 2021-10-13T06:23:55+05:30 IST