ఉలిక్కి పడ్డ జుత్తాడ
ABN, First Publish Date - 2021-04-16T05:46:26+05:30
పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడలో గురువారం ఆరుగురు దారుణ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఆరుగురి హత్యతో కలకలం
పెందుర్తి, ఏప్రిల్ 15: పెందుర్తి మండలం వాలిమెరక జుత్తాడలో గురువారం ఆరుగురు దారుణ హత్యకు గురికావడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ గ్రామానికి చెందిన బమ్మిడ విజయ్కుమార్తో పాత కక్షల నేపథ్యంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విజయ్కుమార్ కుటుంబానికి చెందిన ఆరుగురిని హతమార్చిన తరువాత అప్పలరాజు కత్తితో వీధిలోకి వచ్చి వీరంగం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆరుగురిని కిరాతకంగా హత్య చేసిన అప్పలరాజును ఎన్కౌంటర్ చేయాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తరలించేందుకు వీలులేదని భీష్మించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
విజయ్కుమార్ రాకతో మరింత ఉద్రిక్తత
విజయవాడ నుంచి బమ్మిడి విజయ్కుమార్ గురువారం సాయంత్రం జుత్తాడ రావడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అతను వచ్చీ రావడంతోనే నిందితుడి ఇంటి తలుపులను గట్టిగా కాలితో తన్నాడు. మహిళలను, చిన్న పిల్లలను చంపుతారా? అని ఆగ్రహంతో ఊగిపోయాడు. అతనిని పోలీసులు వారించి సంఘటన స్థలానికి తీసుకువెళ్లారు. నిందితుడి కుటుంబ సభ్యులు ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా జరిగిందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే అదీప్రాజ్, వైసీపీ నేత వంశీకృష్ణ శ్రీనివాస్ సంఘటన స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం మృతదేహాలను పోలీసులు కేజీహెచ్కి తరలించారు.
Updated Date - 2021-04-16T05:46:26+05:30 IST