అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
ABN, First Publish Date - 2021-04-24T05:15:09+05:30
దువ్వాడ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు
కూర్మన్నపాలెం, ఏప్రిల్ 23: దువ్వాడ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇందుకు సంబంధించి దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి... సింహాచలం దరి బాలాజీ నగర్కు చెందిన మడక రాము(40) కూర్మన్నపాలెం దరి శాతవాహన నగర్ శ్రీసాయి అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. రాము స్థానికంగా ప్రైవేటు కంపెనీలో వెల్డర్గా పనిచేస్తున్నాడు. రాము తల్లిదండ్రులు గతంలో మృత్యువాత పడటంతో బాబాయ్, పిన్నిల వద్ద ఉంటున్నాడు. ఇటీవల బాబాయ్, పిన్నిలు తమ పిల్లల వద్దకు అమెరికా వెళ్లిపోవటంతో వారి ఫ్లాట్లో ఒంటరిగా ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఓల్డ్ ఐటీఐ జంక్షన్లో నివాసముంటున్న రాము బావ ఈశ్వరరావు రాముకు ఎన్నిమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆయన శాతవాహననగర్ వచ్చి చూడగా మంచంపై నిర్జీవంగా ఉండటాన్ని గమనించి దువ్వాడ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న దువ్వాడ పోలీసులు ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఆరోగ్యం బాగా లేకపోవటంతో కలత చెంది, ఏదైనా విషం తీసుకొని మృతి చెందాడా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Updated Date - 2021-04-24T05:15:09+05:30 IST