అప్పు తిరిగి చెల్లించమన్నందుకు...
ABN, First Publish Date - 2021-10-19T06:16:05+05:30
అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగినం దుకు ఇద్దరు అన్నద మ్ములు ఆగ్రహించి, అప్పు ఇచ్చిన నలుగురు అన్నదమ్ములపై కర్రలతో దాడులకు దిగారు.
నలుగురు సోదరులపై అన్నదమ్ముల దాడి
తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఆస్పత్రికి తరలింపు
లచ్చన్నపాలెంలో ఘటన...
కేసు నమోదు చేసిన పోలీసులు
మాకవరపాలెం, అక్టోబరు 18: అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగినం దుకు ఇద్దరు అన్నద మ్ములు ఆగ్రహించి, అప్పు ఇచ్చిన నలుగురు అన్నదమ్ములపై కర్రలతో దాడులకు దిగారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం వారంతా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. మాకవరపాలెం మండలంలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి. లచ్చన్నపాలెంలో ఉంటున్న కిల్లంపల్లి శ్రీను, కన్నబాబు, ప్రసాద్, శివ అనే నలుగురు సోదరులు కలిసి, అదే గ్రామానికి చెందిన పోతల రాజబాబు, అతని సోదరుడు వరహాలబాబుకు ఐదేళ్ల క్రితం సుమారు రూ.8 లక్షలను వడ్డీకి అప్పుగా ఇచ్చారు. కొంత కాలం తర్వాత డబ్బులు ఇవ్వాలని శ్రీను, అతని సోదరులు అడగడం ప్రారంభించారు. నాటి నుంచి రాజబాబు అన్నదమ్ములు అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తామని కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. అయితే కిల్లంపల్లి శ్రీను కూమార్తెకు వివాహం నిశ్చయం కావడంతో డబ్బుల కోసం రాజబాబు సోదరుల ఇంటికి సోమవారం ఉదయం వెళ్లారు. అక్కడ తొలుత వాగ్వాదం జరిగింది. అదికాస్త కొట్లాటకు దారితీసింది. దీంతో అప్పుతీసుకున్న రాజబాబు సోదరులు అప్పు ఇచ్చిన అన్నదమ్ములపై కర్రలతో దాడులకు దిగారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ కృష్ణారావు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను రెండు 108 వాహనాల్లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం దాడి చేసిన ఇద్దరు అన్నదమ్ములను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు. శ్రీను తలపై బలమైన గాయం కాగా, కన్నబాబుకు చెయ్యి విరిగిపోయింది. ప్రసాద్, శివకు కాళ్లు విరిగాయి. ప్రస్తుతం వీరు చికిత్సలు పొందుతున్నారు.
Updated Date - 2021-10-19T06:16:05+05:30 IST