పెట్రో ధరలపై వామపక్షాల ధర్నా
ABN, First Publish Date - 2021-10-29T05:44:49+05:30
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల బాదుడుపై ఆగ్రహం
నర్సీపట్నం అర్బన్, అక్టోబరు 28: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం సబ్కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ, కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూపోతూ సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విపరీతమైన భారాన్ని మోపుతున్నదని విమర్శించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపై పలు రకాల పన్నులు విధిస్తూ ప్రజలపై మరింత భారం మోపుతున్నదని ధ్వజమెత్తారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా చార్జీలు పెరిగిపోయి, వాటి ప్రభావం అన్ని రకాల వస్తుల ధరలపై పడుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు గురుమూర్తి, డి.సత్తిబాబు, అడిగర్ల రాజు, సాపిరెడ్డి నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
నక్కపల్లిలో...
నక్కపల్లి, అక్టోబరు 28: అడ్డూ అదుపూ లేకుండా పెంచేస్తున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నక్కపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి వరకు వినూత్నరీతిలో ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై ధరల భారంమోపి మరింత పేదరికంలోకి నెడుతున్నాయని వాపోయారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతున్న కొద్దీ వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతూనే వుంటుందని, దీంతో ధరల తగ్గింపు అంశంపై రెండు ప్రభుత్వాలూ నాటకాలు ఆడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మనబాల రాజేశ్, నాయకులు మనబాల వీర్రాజు, పిల్లి తాతారావు, త్రినాథ్, రండు బాబు, నమ్మి సూర్యనారాయణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T05:44:49+05:30 IST