చందనం అరగదీతకు ఏర్పాట్లు పూర్తి
ABN, First Publish Date - 2021-05-06T05:13:23+05:30
వరాహ లక్ష్మీనృసింహస్వామికి పైపూతగా పూసే చందనం తొలివిడత అరగదీతకు ఆలయ అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు.
సింహాచలం, మే 5: వరాహ లక్ష్మీనృసింహస్వామికి పైపూతగా పూసే చందనం తొలివిడత అరగదీతకు ఆలయ అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు. గత ఏడాది తమిళనాడు అటవీశాఖ డిపో నుంచి కొనుగోలు చేసి ఆలయ బాంఢాగారంలో భద్రపరచిన గంధపు చెక్కలను బుధవారం ఉదయం బయటకు తీశారు. దేవస్థానం కార్పెంటర్ రమణ వాటిని అరగదీసేందుకు వీలుగా ముక్కలుగా చేశారు. స్థానాచార్యుడు డాక్టర్ టీపీ రాజగోపాల్, ఆలయ పురోహితుడు కరి సీతారామాచార్యులు, తదితరులు ఆ ముక్కలను గంగధార జలాలలో నానబెట్టారు. ఈనెల ఏడో తేదీ ఉదయం స్వామివారి ప్రభాత ఆరాధనల తర్వాత నాలుగో తరగతి సిబ్బంది భక్తిశ్రద్ధలతో నోటికి వస్త్రాలు కట్టుకుని చందనాన్ని అరగదీయనున్నారు. కాగా గంధపు చెక్కలను కోసే ప్రక్రియను దేవాలయ పర్యవేక్షణాధికారి దాసరి బంగారినాయుడు పరిశీలించారు.
Updated Date - 2021-05-06T05:13:23+05:30 IST