అప్పన్న ప్రసాదాలు రుచిగా ఉండాల్సిందే.
ABN, First Publish Date - 2021-10-29T05:47:10+05:30
వరాహ లక్ష్మీనృసింహస్వామి ప్రసాదాలు రుచికరంగా ఉండేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని పాకశాలలోని కైంకర్యపరులు, సంబంధిత అధికారులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ఆదేశించారు.
సరుకుల నాణ్యతలో రాజీ పడొద్దు
దేవస్థానం ఈవో సూర్యకళ
సింహాచలం, అక్టోబరు 28: వరాహ లక్ష్మీనృసింహస్వామి ప్రసాదాలు రుచికరంగా ఉండేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని పాకశాలలోని కైంకర్యపరులు, సంబంధిత అధికారులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ఆదేశించారు. ఈ నెల 20న జరిగిన పాలక మండలి సమావేశంలోనే కాకుండా తరచూ ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలపై ఈవో తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగా గురువారం ఆలయ ప్రధాన స్టోర్స్ను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రసాదాల తయారీలో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. లడ్డూ తయారీకి వినియోగించే శనగపిండిని గతంలో మాదిరిగా పూర్తిగా ఎండబెట్టాలని సిబ్బందికి సూచించారు. పాత అన్నదాన భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో ప్రసాదాల తయారీకి వాడే ముడి సరకుల నిల్వకు, సరకుల భద్రత నిమిత్తం మూడంతస్థుల భవన నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ప్రసాదాల రుచిలో ఎట్టి పరిస్థితిల్లోనూ రాజీ పడవద్దని, ప్రసాదాలు నిల్వ చేసే ట్రేలను తరచూ శుభ్రపరచాలన్నారు. ప్రసాదాల రుచిపై భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించి అందుకు తగ్గట్టుగా తయారీ విధానంలో మార్పులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో కేకే రాఘవకుమార్, ఈఈ కోటేశ్వరరావు, డీఈఈ సీహెచ్వీ రమణ, ప్రసాదాల విభాగం పర్యవేక్షణాధికారి పిళ్లా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-29T05:47:10+05:30 IST