‘మెడికల్ కాలేజీ’ల్లో మెలిక!
ABN, First Publish Date - 2021-02-18T10:00:46+05:30
రాష్ట్రంలో కొత్తగా తలపెట్టిన 16 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. వీటిలో మూడు కాలేజీల నిర్మాణ పనులకు ఎప్పుడో టెండర్లు ఖరారయినా..పనులు చేయాల్సిన కంపెనీలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి
ముందు నిధులు ఇవ్వండి.. ఆ తర్వాతే పనుల్లోకి దిగుతాం
సర్కారుకు కంపెనీల షరతు.. 3 కాలేజీలకు టెండర్లు పూర్తి
దక్కించుకొన్న అస్మదీయులు.. అయినా మొదలవ్వని పనులు
సర్కార్ ఆర్థికస్థితి చూసి వెనక్కి.. గ్యారంటీ కోరుతున్న సంస్థలు
అడ్వాన్స్ పేమెంట్కోసం పట్టు.. కలిసిరాని బ్యాంకుల వైఖరి
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో కొత్తగా తలపెట్టిన 16 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. వీటిలో మూడు కాలేజీల నిర్మాణ పనులకు ఎప్పుడో టెండర్లు ఖరారయినా..పనులు చేయాల్సిన కంపెనీలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూసి పనులు మొదలు పెట్టాలా...లేదా..అన్న సందిగ్ధతలో అవి పడ్డాయి. ‘నిధులు విడుదల చేశాకే పనులు మొదలుపెడతాం’ అని సదరు కంపెనీలు సర్కారుకు తెగేసి చెబుతున్నాయట! దీంతో గత రెండు నెలలుగా మెడికల్ కాలేజీల నిర్మాణ వ్యవహారం ముందుకు కదలడం లేదని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏపీఎంఎ్సఐడీసీ అధికారులు మూడు నెలల క్రితం పాడేరు, పిడుగురాళ్ల, పులివెందుల్లో కొత్త కాలేజీల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉన్న రెండు కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొన్నాయి. అంతా ఊహించినట్టే పాడేరు, పిడుగురాళ్ల టెండర్లను ఆ రెండు కంపెనీలు దక్కించుకున్నాయి. పులివెందుల టెండరును హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ కంపెనీ దక్కించుకుంది. అయినా, ఒక్క కంపెనీ కూడా నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏపీఎంఎ్సఐడీసీ అధికారులు ఇప్పటివరకూ మూడు కంపెనీలకు ఎల్వోఏ (లెటర్ ఆప్ యాక్సెప్టెన్సీ) ఇవ్వలేదు. ఇచ్చినా తీసుకునే పరిస్థితి లేనట్లుగా తెలుస్తోంది.
ఎవరు చూసొచ్చారంట!
ఎల్వోఏ తీసుకోవాలంటే ముందుగా తాము అడిగిన వాటికి సమాధానం చెప్పాలని కొన్ని కంపెనీలు షరతులు పెడుతున్నాయి. దీనిపై అధికారులకు ప్రత్యేకంగా లేఖలు రాశాయి కూడా. ‘‘కొత్త కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత బిల్లులు ఆలస్యం కావని గ్యారెంటీ ఇస్తారా..? పనులు ప్రారంభించాలంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందాలి. లేదంటే అడ్వాన్స్ పేమెంట్స్ ఇవ్వాలి. వీటిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే.. పనులు ప్రారంభిస్తాం’’ అని లేఖల్లో తెగేసి చెప్పారు. ఈ లేఖలపై ఆరోగ్యశాఖ అధికారులు ఎటూ తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు.
మూడుకే ముప్పుతిప్పలు!
ఏపీఎంఎ్సఐడీసీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమైతే మూడు కాలేజీలకు సంబంధించి ఇప్పటికే పిల్లర్లు పూర్తి చేసి, మొదటి అంతస్తు స్లాబు కూడా పూర్తి కావాలి. కేంద్ర ప్రభుత్వం పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల కాలేజీల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ప్రతి కాలేజీకి రూ.325 కోట్లు చొప్పున మూడు కాలేజీలకు కలిపి రూ.975 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. కానీ ఇందులో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అంటే ఇందులో రూ.585 కోట్లు కేంద్ర ప్రభుత్వం, రూ.390 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఇవి కాకుండా ప్రభుత్వం అంచనా ప్రకారం ప్రతి కాలేజీకి రూ.500 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రతి కాలేజీకి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.125 కోట్లు విడుదల చేయాలి. మొత్తంగా మూడు కాలేజీలకు కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.720 కోట్లు నిధులు ఇవ్వాలి.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆ మూడు కాలేజీల నిర్మాణం కోసం ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేసింది. ప్రతి కాలేజీకి రూ.50 చొప్పున రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.60 కోట్లు జతచేసి కాలేజీల నిర్మాణం చేపట్టాలి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఆ స్థాయిలో నిధులు లేవు. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ నుంచి కొంత మొత్తాన్ని తీసుకున్నారు. ఇప్పటికే ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి రూ.50 కోట్లను డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) ఖాతాల్లోకి ప్రభుత్వం మళ్లించింది. ప్రస్తుతానికి ఈ మూడు కాలేజీల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రూ.249 కోట్లను ఏపీఎంఎ్సఐడీసీకి బదిలీ చేశారు. అయినా, కంపెనీలు మాత్రం పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. అందుకు వాటి కారణం వాటికి ఉంది. మూడు కాలేజీల నిర్మాణానికే ప్రభుత్వానికి ఈ స్థాయిలో తలనొప్పులు ఉంటే... మిగిలిన 13 కాలేజీల నిర్మాణం సాధ్యమేనా అన్న అనుమానాలు వస్తున్నాయి.
కంపెనీలిలా.. బ్యాంకులలా..
ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ లెక్కన 16 మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం సుమారు రూ.ఎనిమిది వేల కోట్లు అవసరం. దీనికి అనుగుణంగానే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు నాడు - నేడు పనులకు మరో రూ.నాలుగు వేల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని ఏపీఎంఎ్సఐడీసీ అధికారులు అంచనా వేశారు. ఇలా మొత్తం రూ.12 వేల కోట్ల నిధులు సమకూర్చడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూసి బ్యాంకులూ రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. పైగా నిర్మాణ సంస్థల కంటే ఎక్కువగా బ్యాంకులే షరతులు పెడుతున్నాయి. అయినా ఏదో ఒకటి చేసి బ్యాంక్ల నుంచి నిధులను తెచ్చుకొనే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆ ప్రయత్నాలు ఫలించి, మొత్తం నిధులు వచ్చిన తర్వాతనే పనులు మొదలుపెట్టాలని కంపెనీలు భావిస్తున్నాయని సమాచారం.
Updated Date - 2021-02-18T10:00:46+05:30 IST