Tirumala: వేడుకగా శ్రీవారి స్నపనం
ABN, First Publish Date - 2021-10-11T02:49:16+05:30
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో పచ్చకర్పూరం, లవంగాలు, జొన్నకంకులు, యాలకులు, ముత్యాలు, తామర, తులసి విత్తనాలు, పసుపు పవిత్రాలు, తామరపూల మాలలతో...
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయంలో పచ్చకర్పూరం, లవంగాలు, జొన్నకంకులు, యాలకులు, ముత్యాలు, తామర, తులసి విత్తనాలు, పసుపు పవిత్రాలు, తామరపూల మాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి వేద మంత్రాల నడుమ కంకణభట్టార్ వాసుదేవ భట్టాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో వివిధ రకాల మాలలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు భక్తులను అనుగ్రహించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చకస్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. తిరుపూర్కు చెందిన దాత రాజేందర్ సహకారంతో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక మాలలు, కిరీటాలు ఏర్పాటు చేశామని టీటీడీ ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.
Updated Date - 2021-10-11T02:49:16+05:30 IST