ఇదే లాస్ట్ చాన్స్!
ABN, First Publish Date - 2021-05-08T08:45:31+05:30
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతం.. నష్టపరిహారం.. బాధితులకు సహాయ పునరావాసం.. ముంపు నివారణకు రక్షణ గోడ నిర్మాణం వంటి అంశాలపై ఒడిశా, ఛత్తీ్సగఢ్ ప్రభుత్వాలకు ఆఖరి అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది
సంయుక్త సర్వేకు సిద్ధపడాలి
పోలవరంపై ఒడిసా, ఛత్తీస్గఢ్కు కేంద్రం తాఖీదు?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రాంతం.. నష్టపరిహారం.. బాధితులకు సహాయ పునరావాసం.. ముంపు నివారణకు రక్షణ గోడ నిర్మాణం వంటి అంశాలపై ఒడిశా, ఛత్తీ్సగఢ్ ప్రభుత్వాలకు ఆఖరి అవకాశం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. సంయుక్త సర్వేకు అంగీకరించాలని ఆ రాష్ట్రాలకు త్వరలో నోటీసు పంపనుంది. దానికి 45 రోజుల్లోపు స్పందించకుంటే.. ఈ ప్రాజెక్టు వల్ల ఆయా రాష్ట్రాల్లో పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని భావించాల్సి వస్తుందని స్పష్టంచేనుంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు 2009 నుంచి పోలవరం నిర్మాణం కారణంగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు వీలుగా సంయుక్త సర్వే చేద్దామని ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్రాలకు తరచూ లేఖలు రాస్తోంది. అయితే ప్రాజెక్టు నిర్మాణాన్నే పూర్తిగా వ్యతిరేకిస్తున్న ఈ రెండు రాష్ట్రాలూ.. సర్వేకు ముందుకు రావడం లేదు. ఒడిశా ఏకంగా ప్రాజెక్టునే వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రాజెక్టు నిర్మాణంతో అటబీ భూములకు నష్టం వాటిల్లుతుందని.. పర్యావరణానికి హాని జరుగుతుందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ను ఒడిశా, చత్తీ్సగఢ్ ఆశ్రయించాయి. ఏపీపై తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్జీటీకి ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. సంయుక్త సర్వేకు అంగీకరించాలంటూ కేంద్ర పర్యావరణ శాఖ లేఖ రాయగా, తెలంగాణ ఒక్కటే అంగీకరించింది.
సీలేరు నుంచి నీటి విడుదల ఆగితేనే..గ్యాప్-3 మూసివేత పనులు!
పోలవరం గ్యాప్-3లోని 300మీటర్ల ఖాళీని మూసివేసి కాఫర్ డ్యాంను 25 మీటర్ల ఎత్తున నిర్మించడం చాలా కీలకంగా మారింది. ఆ 300 మీటర్ల గ్యాప్ను పూడ్చాలంటే గోదావరిలోకి సీలేరు జల విద్యుత్కేంద్రం నుంచి రోజుకు 4500క్యూసెక్కుల చొప్పున వస్తున్న వరదను ఆపాల్సిఉంది. పదిరోజులు విద్యుదుత్పత్తి ఆపడానికి సర్కారు సిద్ధమైంది. అయితే, 30 రోజులైనా సమయం కావాలని నిర్మాణ సంస్థ కోరుతోంది. అంటే నెల రోజులపాటు సీలేరులో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలన్న మాట. ఈ నెలాఖరులో గా పనులు పూర్తికాకుంటే జూన్ తొలివారం నుంచి ఎగువన కురిసేవానలకు భారీ వరద వ స్తే పనులు నిలిచిపోతాయని అంటున్నారు.
Updated Date - 2021-05-08T08:45:31+05:30 IST