రాజధాని నిర్ణయంలో రహస్యమే లేదు!
ABN, First Publish Date - 2021-07-21T07:34:48+05:30
ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయం పబ్లిక్ డొమైన్లోనే ఉందని, అందులో రహస్యమేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు.. అమ్మినవాళ్లకు నష్టం లేదు
కొన్నవాళ్లు వారిని మోసగించలేదు
హైకోర్టు చట్టవిరుద్ధంగా వ్యవహరించలేదు
వాస్తవాలు చూశాకే ఎఫ్ఐఆర్లు కొట్టివేసింది
నేరం జరగలేదని తేల్చేసింది
రాష్ట్రప్రభుత్వ పిటిషన్లో మెరిట్ లేదు
అందుకే కొట్టివేస్తున్నాం: సుప్రీంకోర్టు
రాజధానికి సంబంధించి వాస్తవాలన్నీ అప్పటికే ప్రజలకు తెలిశాయి కాబట్టి అమ్మినవాళ్లకు నష్టం వచ్చిందని చెప్పడానికి ఏ మాత్రం ఆస్కారం లేదు. విక్రయదారులను కొనుగోలుదారులు మోసం చేసినట్లు ఆధారాల్లేవు.
రాజధాని అక్కడ రాబోతోందని విక్రేతలకు తెలియజేయాల్సిన అవసరం కొనుగోలుదారులకు లేదు. పైగా అప్పటికే రాజధాని ఎక్కడ రానుందో అందరికీ తెలిసిపోయింది.
- సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఎక్కడ వస్తుందన్న విషయం పబ్లిక్ డొమైన్లోనే ఉందని, అందులో రహస్యమేమీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజధానికి సంబంధించి వాస్తవాలన్నీ అప్పటికే ప్రజలకు తెలిసినందున అమ్మినవాళ్లకు నష్టం వచ్చిందని చెప్పడానికి ఆస్కారం లేదని.. విక్రయదారులను కొనుగోలుదారులు మోసం చేసినట్లు ఆధారాలు లేవని తేల్చింది. అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని తేల్చి.. సీఐడీ నమోదు చేసిన కేసులను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన ఆరు పిటిషన్లను సోమవారం జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దానికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులను వెలువరించింది. అమ్మకందారుల ప్రయోజనాలను కొనుగోలుదారులు పరిరక్షించాలన్న చట్టబద్ధమైన నిబంధనలు లేవని స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు కొనసాగిస్తే.. కొందరు అధికారులు తప్పులు చేసినట్లు రుజువు కావచ్చని ఫిర్యాదుదారు తరఫు సీనియర్ న్యాయవాది పరస్ కుహాడ్ పేర్కొన్నారని.. అయితే లావాదేవీలన్నీ ప్రైవేటు భూములకు సంబంధించినవని, ప్రైవేటు వ్యక్తుల మధ్యే జరిగాయని.. హైకోర్టు కూడా ఇదే అభిప్రాయపడిందని ధర్మాసనం గుర్తుచేసింది. అందుచేత తాము జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ప్రాథమిక దశలోనే ఈ కేసులో జోక్యం చేసుకోడానికి హైకోర్టుకు పరిధి లేదన్న రాష్ట్రప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేసు లోతుల్లోకి హైకోర్టు వెళ్లకుండా ఉండాల్సిందని.. తాను గమనించిన వాస్తవాలను రికార్డు చేయకుండా ఉండాల్సిందన్న వాదననూ తిరస్కరించింది.
ఈ వాదనను అంగీకరిస్తే.. కోర్టు ప్రక్రియ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఏ కోర్టులూ తమ అధికారాలను ఉపయోగించవని పేర్కొంది. క్రిమినల్ ఫిర్యాదులో గానీ, ఎఫ్ఐఆర్లో గానీ పేర్కొన్న వివరాల ఆధారంగా నిందితుడిపై విచారణ సాగించవచ్చో లేదో కోర్టులు తప్పక చూడాలన్నది తమ అభిప్రాయమని ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టు ఈ కోణంలో విస్తృత పరిశీలన జరిపిందని తెలిపింది. వాస్తవాలను పరిశీలించి ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ.. తాను కనుగొన్న అంశాలను హైకోర్టు రికార్డు చేయడంలో ఎలాంటి చట్టవిరుద్ధతా లేదని స్పష్టంచేసింది. ‘విశ్వాస ఉల్లంఘన లేనందున సెక్షన్ 486, ఎలాంటి నేరపూరిత కుట్రా లేనందున సెక్షన్ 120బీ ఈ కేసులో వర్తించవని హైకోర్టు తెలిపింది. హరియాణా ప్రభుత్వం వర్సెస్ భజన్లాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పరిశీలించాకే ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని నిర్ణయించింది..’ అని స్పష్టం చేసింది. అలాగే ఐపీసీ సెక్షన్ 418 ఈ కేసులో వర్తించదని.. ఈ కోణంలో రాష్ట్రప్రభుత్వం హైకోర్టులో వాదించలేదని, పిటిషన్లోనూ ప్రభుత్వం దీనిని కారణంగా చూపలేదని పేర్కొంది. ఈ కారణాల రీత్యా ప్రభుత్వ పిటిషన్లో మెరిట్ లేదని, కాబట్టి దీనిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
Updated Date - 2021-07-21T07:34:48+05:30 IST