స్పీకర్తో గంటా ఏకాంత చర్చలు!
ABN, First Publish Date - 2021-03-25T20:49:24+05:30
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం సమావేశమయ్యారు.
అమరావతి: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం సమావేశమయ్యారు. గంటాను స్పీకర్ సాదరంగా ఆహ్వానించారు. స్పీకర్ క్యాంపు కార్యాలయంలో గంటా - స్పీకర్ ఏకాంతంగా చర్చలు నిర్వహించినట్లు సమాచారం. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. ఈ భేటీలో తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు గంటా శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే. లెటర్ హెడ్పై స్వయంగా రాసిన రాజీనామా లేఖను స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ ప్రారంభం కాగానే తన రాజీనామాను ఆమోదించాలని కోరినట్టు చెప్పారు. అయితే అది స్పీకర్ ఫార్మేట్లో లేదని ఆరోపణలు రావడంతో మరోసారి ఏకవాక్యంతో తన రాజీనామా గంటా సమర్పించారు.
స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చిన రాజీనామా లేఖ ప్రతులను వైజాగ్ ప్రెస్క్లబ్ ప్రతినిధుల ద్వారా ఆయన అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు అందజేశారు. అసెంబ్లీ కార్యదర్శి వాటిని స్పీకర్కు పంపారు. ఆ ప్రతులు అందిన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారామ్.. గంటాతో ఫోన్లో మాట్లాడారు. తన రాజీనామాకు తక్షణమే ఆమోదం తెలపాలని గంటా ఈ సందర్భంగా స్పీకర్ను కోరారు. ఇప్పటివరకు స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన గురువారం స్పీకర్ను కలిసినట్లు గంటా సన్నిహితులు చెబుతున్నారు. అయితే గంటా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కావున, ఉప ఎన్నిక కావాలని అధికార పార్టీ అనుకంటే స్పీకర్ విచక్షణాధికారంతో రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బంది కూడా ఉంటుందని గంటా అనుకున్నారో ఏమో గానీ.. తన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తైన తర్వాత ఆమోదించాలని కోరారు. అది ఇప్పుడు అంత త్వరగా జరిగే పనికాదు. ఇప్పుడు స్పీకర్ కోర్టులో బంతి ఉంది.. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి మరీ.
Updated Date - 2021-03-25T20:49:24+05:30 IST