జగన్ పోస్టర్ చింపితే చిత్రహింసలు పెడతారా?
ABN, First Publish Date - 2021-02-26T09:07:18+05:30
జగన్ పాలనలో సామాన్యులకు భద్రత కరువైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతలు ఊరూరా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ...
- రాష్ట్రంలో సామాన్యులకు భద్రత కరువు: అచ్చెన్న
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జగన్ పాలనలో సామాన్యులకు భద్రత కరువైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైసీపీ నేతలు ఊరూరా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం చోడవరం గ్రామ సచివాలయంపై ఉన్న జగన్ వాల్పోస్టర్ను చింపారనే నెపంతో, ఆ గ్రామంలో లేని టీడీపీ సానుభూతిపరులు బోడకృష్ణ, నిమ్మగడ్డ చైతన్యను అక్రమంగా అదుపులోకి తీసుకుని, నాలుగు రోజులుగా చిత్రహింసలకు గురిచేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పోస్టర్ చింపితేనే హడావుడి చేస్తున్నారని, టీడీపీ నేతలపై భౌతికదాడులకు దిగినవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. బోడకృష్ణ, నిమ్మగడ్డ చైతన్యకు ఏదైనా జరిగితే ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. వారిద్దరినీ వదిలిపెట్టి, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
Updated Date - 2021-02-26T09:07:18+05:30 IST