ఎన్నికల్లో హింస వల్లే రవిశంకర్ ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-02-26T08:03:14+05:30
ప్రత్యర్థుల హింసను భరించలేకే పోలింగ్ బూత్ ఏజెంట్ యాళ్ల రవిశంకర్(25) ఆత్మహత్య చేసుకున్నట్టు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు...
- మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, చినరాజప్ప ఆగ్రహం
అమలాపురం రూరల్, ఫిబ్రవరి 25: ప్రత్యర్థుల హింసను భరించలేకే పోలింగ్ బూత్ ఏజెంట్ యాళ్ల రవిశంకర్(25) ఆత్మహత్య చేసుకున్నట్టు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు అంతూపొంతూ లేకుండా పోయిందని విమర్శించారు. చివరకు పంచాయతీ వార్డు మెంబర్లను గెలిపించుకునేందుకూ రిగ్గింగ్కు పాల్పడే దుస్థితికి అధికార వైసీపీ దిగజారిపోయిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం నడిపూడిలో రవిశంకర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు రెడ్డి సుబ్రహ్మణ్యం, చినరాజప్ప తదితర నేతల బృందం మాజీఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి బండారులంక శ్మశానవాటిక వద్దకు చేరుకుంది. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి టీడీపీ అండగా ఉంటుందని భరోసాఇచ్చారు. రవిశంకర్ కుటుంబానికి రూ.20లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కారకులను అరెస్టు చేయాలని, ఎన్నికను రద్దు చేయాలని డిమాండు చేస్తూ మృతదేహంతో టీడీపీ, జనసేన నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
Updated Date - 2021-02-26T08:03:14+05:30 IST