పలాసలో టీడీపీ కార్యకర్త అదృశ్యం
ABN, First Publish Date - 2021-01-16T00:37:22+05:30
పలాస టీడీపీ కార్యకర్త లక్కోజి వినోద్ అదృశ్యమయ్యారు. అయితే వినోద్ను పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు చెబుతున్నారు.
పలాస: పలాసలో టీడీపీ కార్యకర్త లక్కోజి వినోద్ అదృశ్యమయ్యారు. అయితే వినోద్ను పోలీసులు తీసుకెళ్లారని కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి అప్పలరాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వినోద్ పోస్టులు పెట్టారని అందుకే తీసుకెళ్లారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. వినోద్ది నందిగామ మండలం తామరాపల్లి గ్రామం. ఆయన ఆచూకీ కోసం పలాస పోలీస్స్టేషన్ వద్ద ఎంపీ రామ్మోహన్నాయుడు నిరసనకు దిగారు. అయితే వినోద్ అదృశ్యంపై పోలీసుల పొంతనలేని సమాధానమిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేయడం సహజం! స్థాయి, అవసరాన్ని బట్టి ప్రభుత్వ వర్గాలు వాటికి వివరణలు ఇవ్వడమూ సహజం! ఇక... సోషల్ మీడియాలో పోస్టులు, ఫార్వర్డ్లు సర్వసాధారణంగా మారింది. కానీ తమపై ఏ స్థాయిలో విమర్శలు చేసినా ఇప్పుడు పాలకులు సహించలేకపోతున్నారు. పాలనా వ్యవహారాలపై విమర్శలు చేసిన వారిపై అధికారులే రంగంలోకి దిగి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక... సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడమే ఆలస్యమన్నట్లుగా, పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. నోటీసులు, కేసులు, అరెస్టులతో బీభత్స వాతావరణం సృష్టిస్తున్నారు. ‘భావ ప్రకటన స్వేచ్ఛ’కు అర్థమే లేకుండా చేస్తున్నారు.
Updated Date - 2021-01-16T00:37:22+05:30 IST