24 గంటల్లో వెబ్సైట్లో ఎఫ్ఐఆర్లు
ABN, First Publish Date - 2021-07-20T07:50:44+05:30
కేసు నమోదు చేసిన 24 గంటల్లో పోలీసులు సంబంధిత ఎఫ్ఐఆర్లను వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తున్నారని అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరాం హైకోర్టుకు..
- సుప్రీం మార్గదర్శకాల మేరకే నమోదు
- అఫిడవిట్ దాఖలుకు సమయం ఇవ్వండి
- హైకోర్టుకు నివేదించిన ఏజీ శ్రీరాం
అమరావతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): కేసు నమోదు చేసిన 24 గంటల్లో పోలీసులు సంబంధిత ఎఫ్ఐఆర్లను వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తున్నారని అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరాం హైకోర్టుకు వివరించారు. ఏపీ పోలీస్ సేవ మొబైల్ యాప్ నుంచి 5.5 లక్షలు, అలాగే ఠీఠీఠీ.్చఞఞౌజూజీఛ్ఛి.జౌఠి.జీుఽ వెబ్ సైట్ నుంచి మరో 94,650 ఎఫ్ఐఆర్లను ఫిర్యాదుదారులు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. అప్లోడ్ చేయని ఎఫ్ఐఆర్లు ఉంటే అందుకు సంబంధించిన కారణాలను వెల్లడిస్తామన్నారు. ఎప్ఐఆర్లకు అప్లోడ్కి సంబంధించి పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచుతామని, సమయం ఇవ్వాలని కోరారు. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూ్పకుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం వేసే అఫిడవిట్ పరిశీలించాక స్పందించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. మీడియా ప్రతినిధులు, సామాజిక మాధ్యమాలలో పోస్టింగ్లు పెట్టేవారిపై నిబంధనలకు విరుద్ధంగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ‘టీవీ 5’ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అర్నేశ్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఏడేళ్లలోపు జైలు శిక్ష పడేందుకు అవకాశం ఉన్న కేసుల్లో సైతం వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు? ఎన్ని కేసుల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించారు? ఎన్ని కేసుల్లో నిందితులను రిమాండ్కి పంపారు? కేసు స్థితి.. తదితర వివరాలను కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో ఎఫ్ఐఆర్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారా? లేదా? అనే వివరాలు చెప్పాలని ఏజీని ఆదేశించింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పోలీసుల తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. డీజీపీ అందించిన సమాచారం మేరకు 24 గంటల్లో ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నామన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర వాదనలు వినిపిస్తూ.. సుప్రీం మార్గదర్శకాలను సీఐడీ పోలీసులు ఎన్ని కేసుల్లో అనుసరించలేదో కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకపోతే బాధిత వ్యక్తి కోర్టు ధిక్కరణ కేసు వేయవచ్చని పేర్కొంది.
Updated Date - 2021-07-20T07:50:44+05:30 IST