దేశవ్యాప్తంగా రఘురామకు రోజురోజుకు పెరుగుతున్న మద్దతు
ABN, First Publish Date - 2021-06-06T20:41:47+05:30
ఎంపీ రఘురామకృష్ణరాజుకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఆయనకు ఎంపీ నుంచి అనూహ్య మద్దతు వస్తోంది.
అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఆయనకు ఎంపీ నుంచి అనూహ్య మద్దతు వస్తోంది. ‘‘నన్ను అరెస్టుచేసిన రాత్రి గుంటూరులోని సీబీ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఉంచారు. ఐదుగురు వ్యక్తులు మాస్కులు ధరించి ఉన్నట్లుండి లోపలికి వచ్చారు. వారు పోలీసులేనని నా భావన. వారు నా కాళ్లు కట్టేసి నా పాదాలపై లాఠీలతో, రబ్బరు బెల్టులతో బాదడం ప్రారంభించారు. నా నోట్లో గుడ్డలు కుక్కారు. నా ఛాతీపై కూర్చున్నారు. దాదాపు ఐదు రౌండ్ల పాటు ఇలా సాగింది. నన్ను హత్యచేసే ప్రయత్నంలో భాగంగా గంటకు పైగా దాడి చేశారు’’ అని తనపై జరిగిన దాడిపై ఎంపీలకు లేఖలు రాశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీలకు అతీతంగా తనకు మద్దతివ్వాలని లేఖలో కోరారు.
ఎంపీ రఘురామ లేఖను చూసి పలువురు ఎంపీలు విస్మయానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ లేఖ అందిన వెంటనే ఎంపీ, కాంగ్రెస్ నేత మాణికం ఠాకూర్ ట్విటర్లో తీవ్రంగా స్పందించారు. ‘లోక్ సభలో నా సహచరుడు రఘురాజు నుంచి వచ్చిన లేఖ చూసి దిగ్ర్భాంతి చెందాను. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన పట్ల క్రూరంగా, పచ్చి ఉన్మాదంతో వ్యవహరించారు. సైద్ధాంతికంగా నేను రఘురామతో విభేదిస్తాను. కానీ ఒక పార్లమెంటేరియన్ పట్లే ఈ విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్లో సామాన్య రాజకీయ కార్యకర్తల మాటేమిటి? అదేమన్నా హిట్లర్ రాజ్యమా’ అని ప్రశ్నించారు. ఎంపీ రఘురామకృష్ణరాజుపై కస్టడీలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర దిగ్ర్భాంతికరమని, నమ్మలేకపోతున్నానని కర్ణాటకలోని మాండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు.
ఆదివారం ఉత్తరాది ఎంపీలకు హిందీలో రఘురామకృష్ణరాజు లేఖ పంపారు. తనపై దాడి వివరాలను హిందీలో ఆయన వివరించారు. రఘురామకృష్ణరాజుపై పోలీసుల దాడిని ఎంపీ పరదేశ్ సాహెబ్ సింగ్ ఖండించారు. రఘురామకృష్ణరాజు చేసిన తప్పేంటి? అని పరదేశ్ సాహెబ్ సింగ్ ప్రశ్నించారు. మతమార్పిడులు, మిషనరీలకు వ్యతిరేకంగా గళం విప్పడమే తప్పా? అని పరదేశ్ సాహెబ్ సింగ్ ప్రశ్నించారు.
Updated Date - 2021-06-06T20:41:47+05:30 IST