రౌడీల చేతుల్లో రాష్ట్రం
ABN, First Publish Date - 2021-10-21T10:10:56+05:30
పోలీసుల సహకారంతోనే టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులు జరిగాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
చిప్పకూడు తిన్న వ్యక్తిని సీఎం చేస్తే ఇంతే
ముఖాముఖి తేల్చేసుకోవాలి: అయ్యన్న
నర్సీపట్నం, అక్టోబరు 20: పోలీసుల సహకారంతోనే టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులు జరిగాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన నివాసం వద్ద బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ పోస్టు విలువ తీసేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం లేని చోట బంద్లు, ధర్నాలకు పిలుపునివ్వ డం వల్ల ఫలితం ఉండదని, ఏదైనా ముఖాముఖి తేల్చేసుకోవాలన్నారు. చిప్పకూడు తిన్న వ్యక్తిని, దోపిడీదారుడిని ముఖ్యమంత్రి చేస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం రౌడీలు, దోపిడీదారుల చేతుల్లోకి పోయిందన్నారు. ‘‘ఇటువంటి దౌర్జన్యాలు చేసుకుంటూపోతే.. ఎంతో కాలం సాగదు. రెండేళ్లు ఆగితే ప్రజలే మిమ్మల్ని బట్టలూడదీసి తన్నే పరిస్థితి వస్తుంది’’ అని వైసీపీ నాయకులను హెచ్చరించారు. రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబనే విషయాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ‘‘చంద్రబాబు కాలంత పొడవు లేని నువ్వు చంద్రబాబును తన్నేవాడివా? చంద్రబాబును పక్కనపెట్టి నువ్వో నేనో తేల్చేసుకుందాంరా..’’ అని సవాల్ విసిరారు.
బోస్డీకేలో బూతు ఏముంది?
‘‘టీడీపీ నాయకుడు పట్టాభి బోస్డీకే అంటే బూతులు తిట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. బోస్డీకేలో బూతు మాట ఏముంది? చంద్రబాబును రాష్ట్ర మంత్రులు ఇష్టమొచ్చినట్టు తిట్టినప్పుడు సజ్జల ఎందుకు మాట్లాడలేదు’’ అని అయ్యన్న ప్రశ్నించారు. బోస్డీకే అంటే అర్థం ఏమిటో ఎవరికైనా తెలిస్తే చెప్పాలని నాయకులను అయ్యన్న కోరారు.
Updated Date - 2021-10-21T10:10:56+05:30 IST