నేను బంధువుల ఇంట్లో ఉన్నా.. వీడియో విడుదల చేసిన విద్యార్థిని జయలక్ష్మి
ABN, First Publish Date - 2021-11-09T19:18:16+05:30
ఎస్ఎస్బీఎన్ కాలేజీలో సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడిన డిగ్రీ విద్యార్థిని జయలక్ష్మి ఆ ఘటన తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
అనంతపురం: ఎస్ఎస్బీఎన్ కాలేజీలో సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడిన డిగ్రీ విద్యార్థిని జయలక్ష్మి ఆ ఘటన తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే జయలక్ష్మి అదృశ్యంపై తమకేమీ సంబంధం లేదని పోలీసులు అన్నారు. దీంతో ఆమె ఆచూకీపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జయలక్ష్మి తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. తాను బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు పేర్కొంది. సోమవారం జరిగిన ఘటనతో తనకు ఫోన్ కాల్స్ ఎక్కువగా రావడంతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి బంధువుల ఇంటికి వెళ్లినట్లు జయలక్ష్మి తెలిపింది.
సోమవారం సాయంత్రం నుంచి జయలక్ష్మి కనిపించకుండా పోయింది. ఆమె ఇంటికి తాళం వేసి ఉండడంతో విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిన్నటి నుంచి జయలక్ష్మి ఆచూకీ కోసం విద్యార్థి నేతలు గాలించారు. ఈ నేపథ్యంలో జయలక్ష్మి ఎక్కడ? అంటూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఏబీఎన్ కథనంతో జయలక్ష్మి కుటుంబం స్పందించింది. తాము బంధువుల ఇంట్లో క్షేమంగా ఉన్నట్లు జయలక్ష్మి వీడియో విడుదల చేసింది.
Updated Date - 2021-11-09T19:18:16+05:30 IST