నేడే పరిషత్ పోరు!
ABN, First Publish Date - 2021-04-08T05:09:53+05:30
పరిషత్ ఎన్నికలు యథావిధిగా గురువారం జరగనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను బుధవారం డివిజన్ బెంచ్ కొట్టేసింది.
- 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
- 79 అత్యంత సమస్మాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా
- పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి
(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)
పరిషత్ ఎన్నికలు యథావిధిగా గురువారం జరగనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను బుధవారం డివిజన్ బెంచ్ కొట్టేసింది. ఫలితాల ప్రకటనపై మాత్రం కోర్టు స్టే విధించింది. మళ్లీ ఉత్తర్వులు వచ్చే వరకకు ఫలితాలను ప్రకటించవద్దని ఎస్ఈసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. జిల్లాలో 37 జడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 1,466 ప్రదేశాల్లో 2,288 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 144 సమస్యాత్మక కేంద్రాలను, 79 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఈ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో 5,776 బ్యాలెట్ పెట్టెలను వినియోగించనున్నారు. పోలింగ్ నిర్వహణకు 2,975 మంది అధికారులు, 2,925 మంది సహాయక సిబ్బందిని నియమించారు. 171 మంది జోనల్ అధికారులు, 334 మంది రూట్ అధికారులు విధుల్లో ఉంటారు. 455 మంది మైక్రో అబ్జర్వర్లు, 40మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. సిబ్బంది కోసం 283 ఆర్టీసీ బస్సులను, 266 మినీవ్యానులు, 40 ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోయినా.. అధికారులు, సిబ్బంది బుధవారం మండల కేంద్రాలకు చేరుకున్నారు. కోర్టు తీర్పు అనంతరం ఎన్నికల సామగ్రిని తీసుకున్నారు. సాయంత్రానికే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. కోర్టు డివిజన్ బెంచ్ స్టే ఉత్తర్వుల మేరకు ఎన్నికలు యథావిఽధిగా నిర్వహించినా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రం వాయిదా పడనుంది.
జడ్పీటీసీ బరిలో 133 మంది
పరిషత్ పోరులో 37 జడ్పీటీసీ స్థానాలకు 133 మంది పోటీ పడుతున్నారు. ఇందులో టీడీపీ నుంచి 36 మంది, వైసీపీ నుంచి 37 మంది, జనసేన నుంచి 16, కాంగ్రెస్ నుంచి 15 మంది పోటీ పడుతున్నారు. వీరితో పాటు బహుజన సమాజ్ పార్టీ నుంచి ఒకరు, సీపీఎం నుంచి ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు ఎన్నికల బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా.. అధికార పార్టీ నేతల అరాచకాలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది. అయినా బ్యాలెట్లో టీడీపీ గుర్తు ఉంటుంది. అధిష్ఠానం వద్దన్నా.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొందరు స్థానిక టీడీపీ నాయకులు ఎన్నికల బరిలో నిలిచారు. ‘స్థానిక’ పట్టును నిలబెట్టుకుంటామని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అభ్యర్థులు చనిపోయిన చోట్ల వాయిదా...
జిల్లాలో 11 మండలాల్లో 12 మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఈ ఏడాది వ్యవధిలో చనిపోయారు. భామిని మండలంలో స్వతంత్ర అభ్యర్థి మరణించారు. అక్కడ రెండు ప్రధాన పార్టీలు బరిలో ఉండడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. కంచిలి మండలంలో ఇద్దరు, కొత్తూరు, మందస, రేగిడి, ఆమదాలవలస, శ్రీకాకుళం, పోలాకి, సీతంపేట, వీరఘట్టం, హిరమండలం, బూర్జ మండలాల్లో ఒక్కో ఎంపీటీసీ అభ్యర్థి మరణించారు. దీంతో నామినేషన్లు వేసిన 11 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. హిరమండలం జడ్పీటీసీ అభ్యర్థి చనిపోయారు. ఆ స్థానం మినహా మిగిలిన 37 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Updated Date - 2021-04-08T05:09:53+05:30 IST