అటకెక్కిన ప్రతిపాదనలు
ABN, First Publish Date - 2021-10-18T05:05:36+05:30
మండలంలో అంగన్వాడీ కేంద్రాలకు నాడు-నేడు పథకం కింద శాశ్వత భవనాలు నిర్మించాలన్న ప్రతిపాదన అటకెక్కుతోంది.
అద్దెకొంపలు...అసౌకర్యాల నడుమ నిర్వహణ
‘నాడు-నేడు’ కింద అభివృద్ధికి నోచుకోని వైనం
ఇదీ అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి
సీతంపేట: మండలంలో అంగన్వాడీ కేంద్రాలకు నాడు-నేడు పథకం కింద శాశ్వత భవనాలు నిర్మించాలన్న ప్రతిపాదన అటకెక్కుతోంది. అద్దె కొంపలు, శిథిలా వస్థలో, అసౌకర్యాల నడుమ ఉన్న చోట నాడు-నేడు పథకం కింద 11 కేంద్రాలకు భవనాలు నిర్మించాలని ప్రతిపాదనలు పంపించారు. అయితే ఆ మేరకు నిధులు మంజూరుకాకపోవడంతో కొత్త భవనాల నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగలేదు.
ఇదీ పరిస్థితి
మండలంలో 231 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో 30 ప్రధాన, 99 మినీ కేంద్రాలు అద్దె ప్రాతిపదికన నిర్వహి స్తున్నారు. 85 ప్రధాన, ఏడు మీని కేంద్రాలకు సొంతభవనాలు ఉన్నాయి.అయితే వీటినిర్వహణ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ కేంద్రాల్లో 575 మంది గర్భిణులు, 619 బాలింతలు 3,025 ఇంటి వద్దకు సరుకులు అందజేసిన పిల్లలు, 3057 ప్రీస్కూల్ పిల్లలు ఉన్నారు. వీరికి ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆట పాటలతోపాటు, పాఠ్యాంశాలు బోధించాలి. సరైన వసతి లేకపోవడంతో బోధన సమర్థంగా సాగడంలేదు. ప్రీప్రైమరీ పాఠశాలల్లో అధునాతన బోధన అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. దీంతో భవనాలు శిథిలావస్థలో ఉండడంతోపాటు అద్దెకొంపల్లో ఉండడంతో తమ పిల్లలను పంపించేందుకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.కాగా నాడు-నేడు పథకం ద్వారా కొన్ని భవనాలకు ప్రతిపాదనలు పంపించామని సీడీపీవో రంగలక్ష్మి ఆంధ్రజ్యోతికి తెలిపారు. నిధులు మంజూరు కాకపోవడంతో వాటి పనులు చేపట్టడం లేదని చెప్పారు.
Updated Date - 2021-10-18T05:05:36+05:30 IST