సూక్ష్మ సేద్యానికి స్వస్తి!
ABN, First Publish Date - 2021-06-07T03:55:54+05:30
సూక్ష్మ సేద్యం పథకానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. బొట్టు బొట్టునూ ఒడిసి పట్టుకుని తక్కువ నీటితో ఎక్కువ ఫలితాలు రాబట్టే విధానమే బిందు, తుంపర సేద్యం. సాగునీటిని పొదుపుగా వాడుకునే విధానంపై అవగాహన కల్పించి రైతులను సూక్ష్మ సేద్యం వైపు మళ్లించాలన్నది ఈ పఽథకం ప్రధాన లక్ష్యం.
నిలిచిన ప్రభుత్వ రాయితీ పరికరాలు
ఈ ఏడాదీ జారీకాని ప్రభుత్వ ఉత్తర్వులు
నిరాశ చెందుతున్న రైతులు
(ఇచ్ఛాపురం రూరల్)
సూక్ష్మ సేద్యం పథకానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. బొట్టు బొట్టునూ ఒడిసి పట్టుకుని తక్కువ నీటితో ఎక్కువ ఫలితాలు రాబట్టే విధానమే బిందు, తుంపర సేద్యం. సాగునీటిని పొదుపుగా వాడుకునే విధానంపై అవగాహన కల్పించి రైతులను సూక్ష్మ సేద్యం వైపు మళ్లించాలన్నది ఈ పఽథకం ప్రధాన లక్ష్యం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలులో అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. రెండేళ్లుగా ఈ పథకానికి నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులకు రాయితీ పరికరాలు అందడం లేదు. తక్కువ నీటితో ఎక్కువ ఫలితాలు లభించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీలు కూడా ఉన్నాయి. 2005లో కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఈ పథకం ప్రారంభమైంది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగించింది. దీని ద్వారా ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న ఎస్సి, ఎస్టి రైతులకు 100 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 90 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలు ఇచ్చేవారు. ఒక రైతు గరిష్టంగా రూ. రెండు లక్షలు దాకా లబ్ధి పొందవచ్చు. ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న వారికి 90 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం రైతులు దరఖాస్తు చేసుకోగా అధికారులు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేవారు. సూక్ష్మ సేద్య విధానంలో మొక్కలకు ఎరువులను అందిస్తే వాటి వినియోగం తగ్గడంతో పాటు సరాసరి మొక్కకే పోషకాలు అందుతాయి. దానికి కావలసిన వెంచురీ సదుపాయాన్ని కూడా రాయితీ పరికరాలతో పాటు గతంలో అందించేవారు. సంప్రదాయ విధానంలో ఎరువులు చల్లడం ద్వారా వాటిలో 30 శాతం మేర పోషకాలు ఆవిరై అదనంగా ఎరువులను రైతులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలామంది రైతులు సూక్ష్మసేద్యంపై ఆసక్తి చూపేవారు. కానీ, రెండేళ్లుగా ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో నిరాశ చెందుతున్నారు. తాగునీటికి సైతం కటకటలాడుతున్న ప్రస్తుత తరుణంలో నీటిని జాగ్రత్తగా వాడుకుని సేద్యం చేస్తేనే భవిష్యత్తులో వ్యవసాయానికి మనుగడ ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కానీ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రయోజనాలతో పాటు ముఖ్యంగా అడుగంటిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకోవాల్సిన బాఽద్యతను ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ఈ పథకం అమలుకు సమగ్ర కార్యాచరణతో పాటు, నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిధులు మంజూరు కాలేదు
గత ఏడాది జిల్లాలో 8000 హెక్టార్లు లక్ష్యం నిర్ణయించాం. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి ప్రభుత్వ ఉత్తర్వులు రాలేదు. ఈ ఏడాది అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. త్వరలో దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎవీఎస్వి.జమదాగ్ని, హార్టికల్చర్ పీడీ, శ్రీకాకుళం.
జిల్లాలో మూడేళ్లలో సూక్ష్మసేద్యం అమలు వివరాలు
సంవత్సరం లక్ష్యం(హెక్టార్లు) అమలు(హెక్టార్లు) లబ్ధిదారులు
2017- 18 7500 6145.78 6841
2018- 19 8000 4305.37 4962
2019- 20 8000 1629.99 2162
2020- 21 8000 ( అమలు కాలేదు)
2021- 22 8000 (ఇంత వరకు ఉత్తర్వులు రాలేదు)
Updated Date - 2021-06-07T03:55:54+05:30 IST