గంజాయి రవాణాపై ఉక్కుపాదం
ABN, First Publish Date - 2021-10-30T03:50:24+05:30
గంజాయి రవాణాపై ఉక్కుపాదం
- విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు
ఎచ్చెర్ల, అక్టోబరు 29: గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు తెలిపారు. జిల్లాలో పలుచోట్ల పట్టుబడిన గంజాయిని ఎచ్చెర్ల సాయుధ పోలీసు కార్యాలయ సమీపంలో శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019-20లో మెళియాపుట్టి, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు కేసుల్లో 986.998 కిలోల గంజాయి పట్టుబడింద న్నారు. దీని విలువ రూ.50 లక్షలు ఉంటుందన్నారు. ఈ గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ పర్యవేక్షణలో ధ్వంసం చేసినట్టు చెప్పారు. గంజాయి తదితర మత్తు పదార్థాలకు విద్యార్థులను, యువకులను దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. మత్తు పదార్థాల రవాణా, వ్యాపారంపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎచ్చెర్ల సాయుధ పోలీసు కార్యాలయంలో డీఐజీ వార్షిక తనిఖీలు నిర్వహించారు. వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. సాయుధ పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్పీ అమిత్బర్దర్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు బ్యూరో జాయింట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ కేపీ గోపాల్, ఏఎస్పీలు పి.సోమశేఖర్, టీపీ విఠలేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T03:50:24+05:30 IST