పైశాచికం
ABN, First Publish Date - 2021-06-24T04:56:44+05:30
ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు అమల్లోకి తెచ్చినా.. మహిళలు, చిన్నారులకు రక్షణ కరువవుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై అత్యాచారయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై కామాంధులు అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా జిల్లాలోని నందిగాం, పలాస మండలాల్లో ఇద్దరు చిన్నారులపై అత్యాచారయత్నానికి ఒడిగట్టారు.
- వేరేర్వు చోట్ల ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి
- పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
- దిశ చట్టం కింద కేసులు నమోదు
నందిగాం/పలాస, జూన్ 23: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు అమల్లోకి తెచ్చినా.. మహిళలు, చిన్నారులకు రక్షణ కరువవుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై అత్యాచారయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులపై కామాంధులు అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా జిల్లాలోని నందిగాం, పలాస మండలాల్లో ఇద్దరు చిన్నారులపై అత్యాచారయత్నానికి ఒడిగట్టారు. నందిగాం మండలం లోని ఓ గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో పట్నాన రాజారావు అనే వృద్ధుడు చిన్నపాటి దుకాణం నడుపుతున్నాడు. అక్కడే ఓ ఏడేళ్ల చిన్నారి అమ్మమ్మ వద్ద నివాసముంటూ చదువుకుంటోంది. తల్లిదండ్రులు వలస కూలీలు. ఈ నేపథ్యంలో చిన్నారిపై రాజారావు కన్నుపడింది. మంగళవారం చాక్లెట్లు ఇస్తానని చిన్నారిని పిలిచి పాఠశాల మరుగుదొడ్ల వద్దకు తీసుకెళ్లాడు. లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఇంతలో రాజారావు పరారయ్యాడు. దీనిపై బాధిత కుటుంబసభ్యులు మంగళవారం రాత్రి నందిగాం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఎస్ఐ బాలరాజు కేసు నమోదు చేసి దిశ పోలీస్స్టేషన్కు బదలాయించారు.
- పలాస పట్టణంలో కూడా బుధవారం తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన పండు అనే 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆయన పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రాథమిక నిర్థారణ చేశారు. దిశ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శంకరరావు తెలిపారు.
Updated Date - 2021-06-24T04:56:44+05:30 IST