మరో‘సారీ’!
ABN, First Publish Date - 2021-09-08T05:34:40+05:30
ఆధార్ నవీకరణ (అప్డేషన్) కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ‘ఆధార్’ తప్పనిసరి. ‘ఆధార్’కు ఫోన్ నెంబర్ అనుసంధానంతో పాటు.. అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే పథకాలు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో వివరాలు సక్రమంగా నమోదు (అప్డేట్) చేసుకునేందుకు ప్రజలు ‘ఆధార్’ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
ఆధార్ నవీకరణలో కొత్త కష్టం
రెండు మార్పులు ఒక్కసారి చేస్తే తిరస్కరణ
ఇబ్బంది పడుతున్న ప్రజలు
(సోంపేట)
ఆధార్ నవీకరణ (అప్డేషన్) కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే ‘ఆధార్’ తప్పనిసరి. ‘ఆధార్’కు ఫోన్ నెంబర్ అనుసంధానంతో పాటు.. అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే పథకాలు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో వివరాలు సక్రమంగా నమోదు (అప్డేట్) చేసుకునేందుకు ప్రజలు ‘ఆధార్’ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కొన్ని పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ‘ఆధార్’ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షించి.. వివరాలు నమోదు చేసుకుంటున్నారు. కొన్ని గంటల తర్వాత ‘ఆధార్ అప్డేట్ రిజెక్టడ్ (తిరస్కరణ) అని ఫోన్లకు సమాచారం రావడంతో ఉసూరుమంటున్నారు. మళ్లీ ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడకు వెళ్లి తిరస్కరణపై ప్రశ్నిస్తుంటే.. సాంకేతిక సమస్య అంటూ నిర్వాహకులు తప్పించుకుంటున్నారు. వాస్తవానికి ఇది ఆపరేటర్ల తప్పిదమే అని తెలుస్తోంది. ఆధార్లో ఒకసారి ఒక మార్పుగానీ, చేర్పుగానీ చేయాలని స్పష్టమైన నిబంధన ఉంది. కానీ, ఆపరేటర్లు ఒకేసారి రెండు, మూడు మార్పులు చేర్పులు చేస్తుండటంతో సమస్య ఉత్పన్నమవుతోందని సమాచారం. బమోమెట్రిక్ విషయంలోనూ అంతే. బయోమెట్రిక్ ఒక్కటే చేయించుకోవాలి. అదనంగా ఏవైనా చేస్తే.. అన్నీ తిరస్కరణకు గురవుతాయి. ఐరిస్, చిరునామా.. ఇలా ఏదైనా ఒక్కొక్కటి మాత్రమే అప్డేట్ చేయాలి. ఒక్కో అప్డేట్కు 16 రోజుల సమయం ఉంటుంది. ఆ గడువు తర్వాత మరో అప్డేట్కు దరఖాస్తు చేసుకోవాలి. అవగాహన లేక చాలామంది మార్పులు, చేర్పులన్నీ ఒకేసారి చేయడంతో.. తిరస్కరణకు గురై ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి దీనిపై అవగాహన కల్పించాలని, మరిన్ని ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
Updated Date - 2021-09-08T05:34:40+05:30 IST