సమష్టిగా పనిచేద్దాం
ABN, First Publish Date - 2021-06-17T04:04:13+05:30
జిల్లాలో ఇసుక, మద్యం అక్రమరవాణాను నియంత్రించేందుకు సమష్టిగా పని చేద్దామని ఎస్పీ అమిత్బర్దర్ పిలుపునిచ్చారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన 17 మంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐలు, 25 మంది ఎస్ఐలతో బుధవారం రాత్రి ఎస్పీ తన కార్యాలయంలో సమీక్షించారు.
అక్రమ రవాణాను నియంత్రిద్దాం
కేసుల దర్యాప్తు వేగవంతం చేయాల్సిందే
ఎస్పీ అమిత్బర్దర్
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్ 16: జిల్లాలో ఇసుక, మద్యం అక్రమరవాణాను నియంత్రించేందుకు సమష్టిగా పని చేద్దామని ఎస్పీ అమిత్బర్దర్ పిలుపునిచ్చారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన 17 మంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐలు, 25 మంది ఎస్ఐలతో బుధవారం రాత్రి ఎస్పీ తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల నుంచి జిల్లాలోకి సారా, గుట్కా రవాణా కాకుండా అడ్డుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్, సీజర్ రిపోర్టు, అరెస్టు, కేసు ప్రాపర్టీ సేకరణ వంటి అంశాలపై చట్టప్రకారం వెళ్లాలని సూచించారు. ప్రతిరోజూ మండల, గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక, మద్యం పాలసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసులు, ఎస్ఈబీ సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేయాలని, నేరచరిత్ర కలిగిన వారి వివరాలు సేకరించాలని తెలిపారు. ఈ సమావేశంలో సెబీ ఏఎస్పీ శ్రీనివాస రావు, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిండెంట్లు భార్గవ్, రాంబాబు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-17T04:04:13+05:30 IST